హైదరాబాద్: టీమిండియాకు ఆడాలన్న ఆశను మాత్రం వదులుకోనని ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరిస్కు ఎంపికైన అంబటి రాయుడు యో-యో పరీక్షలో విఫలమై జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే.
చెన్నై సూపర్ కింగ్స్ విజయోత్సవాలకు హాజరైన అంబటి రాయుడిని టీమిండియాకు తిరిగి ఆడతారా? ఓ విలేకరి ప్రశ్నించగా ''భారత్కు ఆడాలనే ఆశలను ఎప్పటికీ వదులుకోను. ఇప్పటికీ ఆశావహ దృక్పథంతోనే ఉన్నా. నా ఆట, ఫిట్నెస్పైనే దృష్టి పెట్టా. త్వరలోనే మళ్లీ యో-యో పరీక్షకు వెళతాను" అని అన్నాడు.
"ఈసారి యో-యో టెస్టులో పాస్ అవుతాననే నమ్మకం ఉంది. ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడడం నా అదృష్టం. సొంత జట్టుతో ఆడిన భావనే కలిగింది. జట్టులో సహచరులు, అభిమానులు, వాతావరణం అన్ని ఎంతో నచ్చాయి. నా అభిప్రాయాలు ప్రతి ఒక్క ఆటగాడితో పంచుకునే అవకాశం దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉంది'' అని రాయుడు చెప్పాడు.
ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా... ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరిస్లో భాగంగా మంగళవారం మాంచెస్టర్ సిటీలోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లాండ్పై కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.