హరారే: జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియాలో చోటు దక్కించుకున్న అంబటి రాయుడు వన్డే సిరీస్లో మెరుగ్గా రాణిస్తున్నాడు. జరిగిన రెండు వన్లేల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడి భారత విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ క్రమంలో తన ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు అంబటి రాయుడు
టీమిండియా తుది జట్టులో స్థిరత్వం లేకపోయినా తన వన్డే కెరీర్ పట్ల ఆనందంగానే ఉన్నానని చెబుతున్నాడు. జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో 41 పరుగులతో నాటౌట్గా నిలిచి భారత్కు విజయాన్నందించాడు. మొదటి మ్యాచ్లోనూ 62 పరుగులతో అజేయంగా నిలిచి కేఎల్ రాహుల్ శతకం సాధించేందుకు సహకరించాడు.

'నా వన్డే కెరీర్ సాగుతున్న తీరుపై సంతోషంగానే ఉన్నా. జట్టులో నా పాత్రను సమర్థంగా పోషిస్తున్నాను. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని ఆటపై దృష్టి కేంద్రీకరించడమే అతి ముఖ్యం' అని రాయుడు చెప్పాడు. ఏ జట్టుపై ఆడుతున్నా ఒకేలా సాధన చేస్తానని, ప్రత్యేకంగా లక్ష్యాలు పెట్టుకోనని పేర్కొన్నాడు.
'దురదృష్టవశాత్తూ ప్రతి ఒక్కరికీ అవకాశాలు రావు. ప్రస్తుత పరిస్థితుల గురించి మీకు తెలుసు. గతాన్ని చూడకుండా ఆటను మెరుగు పరుచుకోవడం పైనే దృష్టి పెడతా' అని అంబటి ఆత్మస్థైర్యంతో చెప్పాడు.
హరారే వేదికగా 2013లో జింబాబ్వేతో జరిగిన వన్డేల్లో అరంగేట్రం చేసిన రాయుడు.. 29 ఇన్నింగ్సుల్లోనే 1000 పరుగులు మైలురాయిని అత్యంత వేగంగా దాటిన భారత మూడో బ్యాట్స్మన్గా రికార్డులకెక్కాడు.