CSK VS RCB: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే గుర్తొచ్చేది మొదట ధోనీనే. ధోనీ కోసమే సీఎస్కే మ్యాచులు చూసేందుకు ప్రేక్షకులు స్టేడియానికి భారీగా తరలివస్తుంటారు. అయితే ధోనీకి ఉన్న క్రేజ్ వల్ల జట్టులోకి వచ్చే కొత్త ఆటగాళ్లు ఇబ్బంది పడతారని, వారిపై ఎక్కువ ఒత్తిడి ఉంటుందని మాజీ ప్లేయర్ అంబటి రాయుడు కామెంట్స్ చేశాడు. అందుకు గల కారణాన్ని వివరించాడు.
అతడివల్లే అది కొనసాగుతోంది..
సీఎస్కేకు మద్దతు ఇచ్చే ఫ్యాన్స్ అంతా.. ముందు ధోనీ అభిమానులని అన్నాడు అంబటి రాయుడు. "ధోనీ క్రేజ్తోనే సీఎస్కే రాణిస్తోంది. అతడి కోసమే మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు వస్తారు. అదే ఒక్కసారి మహీ వెళ్లిపోతే సీఎస్కే పరిస్థితి మరోలా ఉండొచ్చు. కాబట్టి మహీ అంతటి క్రేజ్ ఉండేలా, అభిమానులను భారీ స్థాయిలో మైదానాలకు రప్పించే స్థాయి క్రికెటర్ ను సీఎస్కే తయారు చేయాల్సిన అవసరం ఉంది. మహీ ఉండటం వల్లే స్టాండ్స్ నిండిపోతున్నాయి. ప్రస్తుతం అంతటి స్థాయి కలిగిన మరో క్రికెటర్ లేడు" అని రాయుడు చెప్పుకొచ్చాడు.

వాళ్లు బయటకు చెప్పలేరు..
ధోనీ వల్ల సీఎస్కేకు వచ్చిన అసాధారణమైన క్రేజ్ ఆ జట్టుకు పూర్తిగా ఉపయోగపడదు అని అభిప్రాయపడ్డాడు రాయుడు. ఎందుకంటే ధోనీపై ఫ్యాన్స్ కు ఉన్న అభిమానం.. CSKలోని ఇతర ఆటగాళ్లపై తగినంత దృష్టి పడకుండా చేస్తోందని చెప్పాడు. ఇది జట్టు సమిష్టి ప్రదర్శనపై ప్రభావం పడే అవకాశం ఉందని, అది మంచిది కాదని చెప్పుకొచ్చాడు. "ఇది కాస్త వినడానికి మరోలా అనిపిస్తోంది. వాస్తవానికి సీఎస్కేలో కొత్తగా వచ్చిన ప్లేయర్స్ కు మొదట్లో కాస్త కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ధోనీ కోసమే అభిమానులు భారీగా వస్తారు. ఆ మద్దతు అద్భుతం. అయితే కొత్త వాళ్లు బ్యాటింగ్కు వచ్చినప్పుడు వారు త్వరగా ఔట్ అవ్వాలని అభిమానులు కోరకుంటారు. అయితే దాని అర్థం జట్టు ఓడిపోవాలని కాదు. ధోనీ త్వరగా బ్యాటింగ్కు వస్తాడనే ప్రేమతో అలా చెబుతుంటారు. అందుకే, అతడిని తలా (నాయకుడు) అని కూడా పిలుస్తుంటారు. జట్టులోకి ఇతర క్రికెటర్లకు కూడా ఈ విషయం క్రీజులోకి వెళ్లగానే అర్థమయిపోతుంది. దీంతో వాళ్లపై కాస్త ఒత్తిడి పెరుగుతుంది. చాలామంది క్రికెటర్లు తమ మనసులో అనుకున్న ఈ విషయాలను బయటకు చెప్పలేరు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కాస్త మారాలి. ఎందుకుంటే మిగతా ప్లేయర్స్ కూడా జట్టు కోసం ఎంతో కమిట్మెంట్తో ఆడుతుంటారు." అని రాయుడు అన్నాడు.