Ambati Rayudu: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్(GT)పై సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సాంకేతికంగా వారి ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగానే ఉన్నప్పటికీ, వారు టాప్-4లోకి వెళ్లడం అసాధ్యమే. వాస్తవానికి ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ను ఘనంగా ప్రారంభించి, ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. కానీ ఆ తర్వాత పేలవ ప్రదర్శన, వరుస ఓటములతో 10 మ్యాచ్లలో కేవలం 3 విజయాలే సాధించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. దీంతో తాజాగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో ఓటమి తర్వాత ఎస్ఆర్హెచ్ పై సెటైర్లు వేశాడు అంబటి రాయుడు. వారు తిరిగి పుంజుకునే అవకాశమే లేదని అన్నాడు.
ఇండియా మ్యాప్లా..
"SRH ఇకపై ముందుకు వెళ్లడం చాలా క్లిష్టంగానే కనిపిస్తోంది. ఈ ఓటమితో ఐపీఎల్ 2025 సీజన్ వారికి మరింత దారుణంగా మారింది. ఇది చూస్తుంటే వారికి అడుగున ఉన్న నీళ్లు కూడా ఆవిరైపోతున్నట్టు ఉంది. ఇప్పుడు పాయింట్స్ టేబుల్ చూస్తుంటే.. భారతదేశ మ్యాప్లా ఉంది. హైదరాబాద్ను దాటి వెళ్తే నేరుగా చెన్నైకి వెళ్తున్నట్టు. వాళ్లు ఎంత దారుణంగా దిగజారారో ఇది చూస్తే అర్థమవుతుంది. ఈ సీజన్లో వాళ్లు తిరిగి పుంజుకుంటారని నాకైతే అనిపించడం లేదు. మైదానంలో వారి ఎనర్జీ కూడా చెప్పుకోదగ్గంత లేదు. ఇకనైనా వారు మెరుగైన క్రికెట్ ఆడాలనే దిశగా ముందుకు సాగాలి. నెక్ట్స్ సీజన్ కోసం జట్టును తిరిగి బలంగా నిర్మించడంపై వారు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందనిపిస్తోంది," అని అంబటి రాయుడు వ్యాఖ్యానించాడు.

బౌలింగ్, ఫీల్డింగ్ లో తుస్సు..
గుజరాత్ తో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ ఫీల్డింగ్లో నిరాశపరిచింది, జట్టులో తగినంత ఉత్సాహం కనిపించలేదని రాయుడు పేర్కొన్నాడు. "ఈ మ్యాచ్ను వాళ్లు మొదటి ఇన్నింగ్స్లోనే కోల్పోయారని నేను అనుకుంటున్నా. టార్గెట్ చాలా ఎక్కువగా ఉంది. వారు మ్యాచ్ ప్రారంభంలో చేసిన బౌలింగ్ చూస్తే అది చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. సాధరణంగా ఉంది. అయితే గుజరాత్ అసాధారణమైన బ్యాటింగ్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. SRH ఫీల్డింగ్లో వెనుకబడింది. క్యాచ్లు మిస్ చేసింది. జీటీ మాత్రం ఫుల్ ఎనర్జీ చూపించింది. కానీ SRH పూర్తి స్థాయిలో డల్ గా ఆడింది." అని రాయుడు వివరించాడు. ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేశాడని పేర్కొన్నాడు అంబటి రాయుడు. జోస్ బట్లర్, రషీద్ ఖాన్ అద్భుతంగా క్యాచులు పట్టుకున్నారని అభినందించాడు.