Karun Nair: భారత జట్టులోకి పునరాగమనం ఇవ్వడమే లక్ష్యంగా కరుణ్ నాయర్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. అవకాశం చిక్కినప్పుడల్లా అద్భుత ప్రదర్శన చేస్తూ సెంచరీలతో సునామీ సృష్టిస్తున్నాడు. ఆ మధ్య దేశవాళీ క్రికెట్ లో వీరవిధ్వంసం సృష్టించిన అతడు.. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ ఐపీఎల్ లో తన తొలి మ్యాచు ఆడాడు. వచ్చీ రాగానే కళ్లు చెదిరే అద్భుత ఇన్నింగ్స్ ప్రదర్శన చేశాడు. తాజా మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన అతడు.. ముంబయి ఇండియన్స్ పై 40 బంతుల్లోనే 89 పరుగులు సాధించాడు.
ఆ టెస్ట్ సిరీస్కు..
ఈ ప్రదర్శనతో కరుణ్ నాయర్ పై ప్రశంసల వర్షం కురవడంతో పాటు.. అతడిని మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ తో ఆడబోయే టెస్ట్ సిరీస్కు కరుణ్ నాయర్ను ఎంపిక చేయాలని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పేర్కొన్నాడు. అతడు భారత జట్టులో ఉండాలని ఆశించాడు.
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..
"భారత క్రికెట్ లో మీరు ఫామ్ కోల్పోయినప్పుడు, ఎదురయ్యే పరిస్థితులు, సవాళ్లను తట్టుకోగలగడం అంత సలభం కాదు. అలాంటి క్లిష్ట పరిస్థితులను తట్టుకుని అద్భుతంగా తిరిగి వచ్చిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో కరుణ్ నాయర్ ఒకడు. భారత దేశీయ క్రికెట్ వ్యవస్థలో ఒకసారి అవకాశాలు కోల్పోతే, తిరిగి రావడం చాలా కష్టం. మానసికంగా ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. చాలా మంది మిమల్ని విస్మరిస్తారు. మర్చిపోతారు. క్రికెట్ వేగంగా ముందుకు సాగిపోతుంది. ఎన్నో మార్పులు వచ్చేస్తాయి. క్రికెట్ కరుణ్ నాయర్ ను మర్చిపోయింది. కానీ అతడు మాత్రం వెనక్కి తగ్గలేదు. కరుణ్ నాయర్ ఎప్పుడూ నేర్చుకోవడం మానలేదు. కఠినంగా శ్రమించడం ఆపలేదు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో తిరిగి రాగలననే నమ్మకాన్ని వీడలేదు. అతడు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం భారత్ జట్టులోకి తిరిగి వస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతడు భారత ఆటగాళ్లు ఎక్కే విమానంలో ఉంటాడని ఆశిస్తున్నాను," అని రాయుడు పేర్కొన్నాడు. కాగా, జూన్ నుంచి ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ను టీమిండియా ఆడనుంది.
