ఇటీవల అన్ని రకాల క్రికెట్కు గుడ్ బై చెప్పేసిన టీమిండియా వెటరన్, ఐపీఎల్ స్టార్ అంబటి రాయుడు సంచలన విషయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్లో జరిగిన ఎన్నో విషయాల గురించి రాయుడు మాట్లాడాడు. వీటిలో 2019 వరల్డ్ కప్ జట్టులో అతన్ని సెలెక్ట్ చేయకపోవడం కూడా ఒకటి.
ఆ వరల్డ్ కప్కు ముందు టీమిండియా నాలుగో స్థానంలో రాయుడు చక్కగా రాణించాడు. అయితే సరిగ్గా టోర్నీకి ముందు జరిగిన రెండు, మూడు మ్యాచుల్లో ఫెయిలయ్యాడు. అంతే వరల్డ్ కప్ ఆడే జట్టులో అతన్ని ఎంపిక చేయలేదు. తనకు ఈ విషయం తెలిసి షాకయ్యానని చెప్పిన రాయుడు.. కావాలనే తనను ఎంపిక చేయలేదంటూ పరోక్షంగా అప్పటీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్పై ఆరోపణలు చేశాడు.

అలాగే తన స్థానంలో విజయ్ శంకర్ను ఆడించడంపై కూడా రాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'నన్ను తప్పించినప్పుడు అజింక్య రహానే వంటి ఆటగాళ్లను సెలెక్ట్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. అనుభవం, సీనియారిటీ ఉన్న ప్లేయర్ను ఎంపిక చేస్తే అక్కడ అసలు చర్చే లేదు. అందరూ భారత్ గెలవాలనే అనుకుంటారు కదా. అసలు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదనే కారణం కూడా ఎవరికీ తెలీదు. ఆ సెలెక్ట్ చేసిన వాళ్లే అది చెప్పాలి' అన్నాడు.
అందరూ విజయ్ శంకర్ను విమర్శించారని, కానీ తనకు మాత్రం అతనిపై ఎలాంటి కోపం లేదని రాయుడు చెప్పాడు. 'విజయ్ శంకర్ ఏం చేస్తాడు చెప్పండి. తన ఆట తను ఆడుకుంటూ ఉన్నాడు విజయ్. అసలు అతన్ని ఎలా సెలెక్ట్ చేశారో అర్థం కాేలదు. ఆరు, ఏడో నంబర్లో ఆడే ప్లేయర్ను సడెన్గా నాలుగో స్థానంలో ఆడటానికి ఎలా సెలెక్ట్ చేస్తారు? అది వరల్డ్ కప్ అనుకున్నారా? లేదంటే లీగ్ మ్యాచ్ అనుకున్నారా?' అని ప్రశ్నించాడు.