దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు నిరాశపరుస్తున్నాడు. ఈ లీగ్లో ముంబయి ఇండియన్స్కు చెందిన ఎంఐ ఎమిరేట్స్కు రాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం గల్ఫ్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో రాయుడు స్లో ఇన్నింగ్స్ ఆడి ముంబయి ఓటమికి కారణమయ్యాడు.
మిడిలార్డర్లో ధనాధన్ ఇన్నింగ్స్లు ఆడే రాయుడు గల్ఫ్తో జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. కానీ ఆరు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు. 40/2 స్థితిలో బ్యాటింగ్కు వచ్చిన రాయుడు తక్కువ స్కోరుకే ఔటవ్వడమే కాకుండా, జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు పడటంతో ముంబయి ఛేదనలో కూడా ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేసి ఓటమిని చవిచూసింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గల్ఫ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. కెప్టెన్ జేమ్స్ విన్స్ (59; 41 బంతుల్లో) టాప్ స్కోరర్. అయితే గల్ఫ్ ఇన్నింగ్స్ నిదానంగానే సాగింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. కానీ ఆఖర్లో వికెట్ కీపర్ జేమీ స్మిత్ (43; 23 బంతుల్లో) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఛేదనలో ముంబయి 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 153 పరుగులే చేసింది. అయిదు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
కెప్టెన్ కీరన్ పొలార్డ్ (40; 31 బంతుల్లో), థాంప్సన్ (26*; 9 బంతుల్లో) పోరాడినప్పటికీ ముంబయికి ఓటమి తప్పలేదు. అయితే ముంబయి విజయానికి ఆఖరి ఓవర్లో 30 పరుగులు అవసరమయ్యాయి. థాంప్సన్ మొదటి బంతి మినహా వరుసగా 4,6, 4,4,6 బాదాడు. థాంప్సన్కు మరో ఎండ్ నుంచి సహకారం లభించి ఉంటే జట్టును గెలిపించేవాడు. మరోవైపు రాయుడు స్లో ఇన్నింగ్స్తో ముంబయి ఓటమిపాలవ్వడం ఇదే మొదటిసారి కాదు. డిజర్ట్ వైపర్స్తో జరిగిన మ్యాచ్లో 30 బంతుల్లో 23 పరుగులే చేశాడు. కాగా, ఇప్పటికే ముంబయి ఎమిరేట్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.