టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని రోజులుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి ఘూటు విమర్శలు చేస్తున్న రాయడు తాజాగా సంచలన ట్వీట్తో వివాదాన్ని ముదిరేలా చేశాడు. ఆటగాళ్ల పేర్లను ప్రస్తావించకుండా పరోక్షంగా దారుణంగా విమర్శించాడు.
అసలేం జరిగిదంటే.. ప్లేఆఫ్స్కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సీఎస్కేపై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో చెన్నై ఇంటికి, బెంగళూరు ముందుకు వెళ్లింది. అయితే మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు, అభిమానులు సంబరాలు చేసుకున్న తీరుపై రాయుడు వ్యంగ్యంగా మాట్లాడాడు. అప్పుడే ఆర్సీబీ టైటిల్ సాధించినట్లుగా ఫీల్ అవుతుందని అన్నాడు.

అయితే ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు ఓటమిపాలైంది. దీంతో రాయుడు ఆర్సీబీని మరోసారి విమర్శించాడు. సంబరాలు, దూకుడుగా ఉంటే కప్ ఇవ్వరని, సీఎస్కేపై గెలిస్తే ట్రోఫీ సాధించనట్లు కాదని రాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తొలి ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం ఒకే విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమణ దాదాపు ఖరారైన స్థితి నుంచి ఆర్సీబీ గొప్పగా పోరాడి వరుసగా ఆరు విజయాలు సాధించింది. బలమైన సీఎస్కే జట్టుపై గెలిచి తదుపరి దశకు చేరింది.
టైటిల్ మిస్ అయినప్పటికీ, ఆర్సీబీ అసాధారణ ప్రదర్శనను కొనియాడుతూ వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ పోస్ట్ చేశాడు. కానీ సీఎస్కే ప్లేయర్లు తుషార్ దేశ్పాండే, దీపక్ చాహర్, మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఆర్సీబీని ట్రోల్ చేయడం గమనార్హం. ఫ్యాన్ వార్లా తమ స్థాయికి మించి ప్రవర్తించారని ఈ ఆటగాళ్లపై నెట్టింట్లో విమర్శలు వచ్చాయి. అయితే రాయుడు దానికి వివరణ ఇస్తున్నట్లుగా చేసిన తాజా ట్వీట్ వివాదం సద్దుమణిగేలా కాకుండా రెట్టింపు చేసేలా ఉంది.
''ఎన్నో ఏళ్లుగా ఆర్సీబీని సపోర్ట్ చేస్తున్న అభిమానుల పట్ల నాకెంతో ప్రేమ ఉంది. కానీ టీమ్ మేనేజ్మెంట్, లీడర్స్.. వ్యక్తిగత మైలు రాళ్ల కోసం కాకుండా జట్టు గురించి ఆలోచిస్తే ఇప్పటికీ ఆర్సీబీ ఎన్నో టైటిళ్లు సాధించేది. ఎంతో మంది అద్భుతమైన ఆటగాళ్లు జట్టును వీడారో ఓ సారి గుర్తు చేసుకోండి. జట్టు కోసం ఆడే ఆటగాళ్లను తీసుకు రమ్మని మేనేజ్మెంట్పై ఒత్తిడి చేయండి. మెగా వేలం నుంచి కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది'' అని అంబటి రాయుడు ట్వీట్ చేశాడు.