ఐపీఎల్-2024 సీజన్ ప్లేఆఫ్స్ రేసు ఊపందుకుంది. టేబుల్ టాప్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ సహా ఏ జట్టూ ధైర్యంగా లేదు. మ్యాచ్లు హోరాహోరీగా సాగుతుండటంతో ఆఖరి వరకు ప్లేఆఫ్స్ కోసం తీవ్ర పోటీ ఏర్పడనుంది. అయితే టాప్-3లో ఉన్న జట్లకు ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ప్రస్తుతం జోరు మీదున్న రాజస్థాన్తో పాటు కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ రేసులో ముందంజలో ఉన్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ కూడా టాప్-4పై కన్నేశాయి. మరోవైపు ముంబై ఇండియన్స్ ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఎనిమిది మ్యాచ్లు ఆడిన ముంబై మూడు విజయాలు సాధించింది. గతంలో మాదిరిగానే ఈ సీజన్లోనూ ఆలస్యంగా గెలుపు తలుపు కొట్టింది. హ్యాట్రిక్ ఓటముల అనంతరం నెగ్గింది. కానీ అదే జోరును కొనసాగించలేకపోతుంది.

2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ సాధించింది. కానీ ఆ తర్వాత సీజన్ నుంచి పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. గత మూడు సీజన్లలో ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్స్కు చేరింది. దీంతో పక్కా ప్రణాళికతో ముంబై ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యను తిరిగి తమ గూటికి తెచ్చుకుంది. గుజరాట్ టైటాన్స్కు టైటిల్ అందించిన హార్దిక్ కోసం ముంబై భారీ మొత్తాన్ని వెచ్చించింది. కానీ హార్దిక్ తన మ్యాజిక్ను చూపించలేకపోతున్నాడు. ఇంటా, బయటా ఏర్పడిన ఒత్తిడికి అతను చిత్తవుతున్నాడు.
కెప్టెన్గానే కాకుండా ఆల్రౌండర్గానూ హార్దిక్ విఫలమవుతున్నాడు. బంతి, బ్యాటుతో ఆకట్టుకోలేకపోతున్నాడు. కీలక సమయాల్లో చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతున్నాడు. రోహిత్ నుంచి బాధ్యతలు అందుకున్నానే ఒత్తిడి, అభిమానుల నుంచి హేళన మధ్యలో ప్రశాంతతతో హార్దిక్ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. అయితే ఈ సమయంలో అండగా ఉండాల్సిన ముంబై ఇండియన్స్ యజమాన్యం హార్దిక్కు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ సీజన్లో ముంబైను తప్పక ప్లేఆఫ్స్కు చేర్చాలని హార్దిక్ను అంబానీ ఫ్యామిలీ హెచ్చరించిందని సమాచారం. ఈ సీజన్ ముగిసిన అనంతరం మెగా వేలం ఉండటంతో హార్దిక్ పట్ల కాస్త కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారని, కెప్టెన్సీపై వేటు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా, ముంబై ప్లేఆఫ్స్కు చేరుకోవాలంటే తర్వాత జరగనున్న ఆరు మ్యాచ్ల్లో కనీసం నాలుగు నుంచి అయిదింట్లో గెలవాల్సి ఉంది.