
దుబాయ్: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ల పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ 2021తో వారి పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. వారందరికీ థ్యాంక్స్ చెబుతూ ఓ ట్వీట్ చేశాడు. ప్రపంచకప్ 2021తో టీ20 కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. ఒక జట్టుగా అందరితో కలిసి అద్భుతమైన ప్రయాణం సాగించానని, ఆ జ్ఞాపకాలు సుమధురమని కోహ్లీ తన ట్వీటులో పేర్కొన్నాడు.
'టీమిండియా కెప్టెన్గా మీరంతా నాకందించిన సహకారం వెలకట్టలేనిది. జట్టుగా మనమెన్నో మరుపురాని విజయాలు సాధించాం. మన ప్రయాణం భారత క్రికెట్ చరిత్రలో మిగిలిపోతుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రవిశాస్త్రి హయాంలో ఆస్ట్రేలియాను సొంతగడ్డపైనే భారత్ రెండు టెస్టు సిరీస్ల్లో ఓడించింది. ఇంగ్లండ్ పర్యటనలోనూ గొప్పగా రాణించి 2-1 ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే.
2014లో టీమిండియా డైరెక్టర్గా నియమితుడైన రవిశాస్త్రి.. 2017లో కోచ్గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత 2019లో మరోసారి అతడి పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది. ఇక ఇప్పుడు నవంబర్ 14తో శాస్త్రి పదవీకాలం ముగిసింది. టీమిండియా కోచ్గా రవిశాస్త్రి ఉన్న సమయంలో భారత జట్టు 43 టెస్టులు ఆడింది. అందులో 25 మ్యాచులు గెలవగా.. 13 మ్యాచుల్లో ఓటమిపాలైంది. రవిశాస్త్రి హయాంలో భారత్ 76 వన్డేలు, 65 టీ20 మ్యాచ్లను ఆడింది. 51 వన్డేలు, 43 టీ20ల్లో భారత్ గెలుపొందింది. టీమిండియాకు విరాట్ కోహ్లీ 50 మ్యాచుల్లో టీ20 జట్టుకు సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. కోహ్లీ నాయకత్వంలో భారత్ 32 టీ20 మ్యాచ్లను గెలిచి.. మరో 16 మ్యాచ్లను ఓడిపోయింది. ఇక రెండు మ్యాచ్లలో ఫలితం రాలేదు. టీ20లలో కోహ్లీ సారథ్యంలో భారత్ ఐసీసీ ట్రోఫీ గెలవకపోయినా.. మంచి విజయాలు అందించాడు.
టీ20 ప్రపంచకప్ 2021లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలైన టీమిండియా సెమీస్ రేసులో వెనుకబడింది. దీంతో చివరి మూడు మ్యాచ్ల్లో ఘన విజయాలు సాధించినా.. టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ఇక నవంబర్ 17 నుంచి న్యూజిలాండ్తో జరుగనున్న టీ20 సిరీస్కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్ నుంచే టీమిండియా కోచ్గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా వన్డే పగ్గాలను కూడా రోహిత్ శర్మకే అప్పగిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి.