
ముంబై: మహిళల వన్డే ర్యాంకింగ్స్ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. టాప్ ప్లేస్ సహా అయిదు స్థానాల్లో ఆస్ట్రేలియా ఖాతాలోకి వెళ్లాయి. ఇంగ్లాండ్, భారత్, దక్షిణాఫ్రికా ప్లేయర్లు తొలి 10 స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. న్యూజిలాండ్లోముగిసిన మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ ముగిసిన రెండో రోజే ఐసీసీ ఈ ప్రపంచ ర్యాంకులను ప్రకటించింది. ఈ టోర్నమెంట్లో ప్లేయర్ల ప్రతిభను ఆధారంగా చేసుకుని తాజాగా ర్యాంకింగ్స్ ప్రకటించింది.
అగ్రస్థానంలో అలీస్సా హీలీ నిలిచింది. ఈ ఆస్ట్రేలియన్ ప్లేయర్.. మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 138 బంతుల్లో 170 పరుగులు చేసింది. ఇందులో 26 ఫోర్లు ఉన్నాయి. హీలీ ధాటికి ఆస్ట్రేలియా 356 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్గా హీలీ చరిత్రకెక్కింది. తొమ్మిది ఇన్నింగ్స్లల్లో 509 పరుగులు చేసిందామె. ఇందులో రెండు బ్యాక్ అండ్ బ్యాక్ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిఛెల్ స్టార్క్ భార్య ఆమె.
రెండో స్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ నథాలి స్కీవర్, మూడో స్థానంలో ఆస్ట్రేలియాకే చెందిన బెథ్ మూనీ నిలిచారు. దక్షిణాఫ్రికా విమెన్ క్రికెటర్ లారా వొల్వార్డ్, ఆస్ట్రేలియా కేప్టెన్ మెగ్ ల్యాన్నింగ్ నాలుగు, అయిదు స్థానాలను దక్కించుకున్నారు. ఆరు స్థానం కూడా ఆస్ట్రేలియాకే దక్కింది. ఈ స్థానంలో రాఛెల్ హేన్స్ నిలిచారు. ఏడు, తొమ్మిది స్థానాలు భారత్కు లభించాయి. ఏడో స్థానంలో మిథాలి రాజ్, తొమ్మిదో ప్లేస్లో స్మృతి మంధాన ఉన్నారు.
న్యూజిలాండ్ ప్లేయర్ అమీ సాట్టెర్వైట్-8, ఇంగ్లాండ్ ప్లేయర్ టామీ బ్యోబౌంట్ 10 స్థానాలను దక్కించుకున్నారు. బౌలింగ్ కేటగిరీలో భారత ప్లేయర్లల్లో టాప్ టెన్లో ఒక్కరికి మాత్రమే చోటు దక్కింది. స్టార్ బౌలర్ ఝులన్ గోస్వామి అయిదో స్థానంలో నిలిచారు. ఆల్రౌండర్ల కేటగిరీలోనూ తొలి 10 స్థానాల్లో భారత్ రెండింటిని ఆక్రమించింది. ఏడోస్థానంలో దీప్తి శర్మ, పదో స్థానంలో ఝులన్ గోస్వామి నిలిచారు.