ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ షెడ్యూల్ దాదాపు ఖరారైంది. సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ను భారత్లోనే నిర్వహిస్తారా లేదా విదేశాల్లో కొన్ని మ్యాచ్లు నిర్వహిస్తారా అనే సందేహాలు వచ్చాయి. అయితే లీగ్ మొత్తాన్ని భారత్లోనే నిర్వహించాలని బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ను ప్రారంభించాలని, మే 26న ఫైనల్ జరిగేలా షెడ్యూల్ ఏర్పాటు చేసిందని సమాచారం.
అలాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ను ఫిబ్రవరి 22 నుండి మార్చి 17 వరకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. డబ్యూపీఎల్ మ్యాచ్లన్నీ బెంగళూరు, ఢిల్లీ వేదికగా జరగనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. అయితే 66 రోజుల పాటు సాగే ఐపీఎల్ షెడ్యూల్ గురించే బీసీసీఐ ఆందోళన చెందుతుంది. షెడ్యూల్ను ఖరారు చేసినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాతనే ఐపీఎల్ గురించి కీలక నిర్ణయం తీసుకోగలరు.

మరోవైపు ఐపీఎల్ ఫైనల్ మే 26వ తేదీ నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే అమెరికా, వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్ జూన్ 1వ తేదీన మొదలుకానుంది. టీమిండియా తొలి మ్యాచ్ జూన్ 5న జరగనుంది. భారత ప్లేయర్లకు విశ్రాంతి తీసుకోవడానికి ఈ సమయం సరిపోతుంది. కానీ జూన్ 2వ తేదీన వెస్టిండీస్, జూన్ 3న శ్రీలంక, దక్షిణాఫ్రికా; జూన్ 4న అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్ దేశాలకు మ్యాచ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని తమ దేశ బోర్డులు భావించే అవకాశం ఉంది. దీంతో ఫైనల్కు కొన్ని దేశ ప్లేయర్లు దూరమయ్యే ఛాన్స్ ఉంది.
అయితే ఈ విషయంపై బీసీసీఐ ముందుగానే ఇతర దేశ క్రికెట్ బోర్డులతో సంప్రదిస్తోంది. ఇప్పటికే కొన్ని బోర్డులు అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల ఎఫెక్ట్ కారణంగా ఐపీఎల్ ఆలస్యమైతే టీ20 ప్రపంచకప్ ముందు ఆటగాళ్లకు విశ్రాంతి దొరకడం కష్టమతుంది. ఈ నేపథ్యంలో కొన్ని మ్యాచ్లు విదేశాల్లో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యామ్మాయంగా దుబాయ్ను బీసీసీఐ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే తమ దేశాన్ని కూడా పరిగణించాలని శ్రీలంక కోరుతుంది.