పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ వివాదంలో చిక్కుకున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) కాంట్రాక్ట్ను కోల్పోయాడు. షోయబ్ మాలిక్తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ 'ఫార్చ్యూన్ బరిషల్' ప్రకటించింది. బంగ్లా లీగ్లో బరిషల్ ఫ్రాంచైజీ తరపున మాలిక్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల ఖుల్నా రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో షోయబ్ మాలిక్ ఆటపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్పిన్ బౌలింగ్లో అతడు ఒకే ఓవర్లో మూడు నోబాల్స్ వేశాడు. దీంతో అతడు మ్యాచ్ ఫిక్సింగ్తో ఇలా చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా స్పిన్నర్లు నోబాల్స్ వేయడం చాలా అరుదుగా ఉంటుంది. కానీ ఓకే ఓవర్లో మూడు నో బాల్స్ వేయడం బంగ్లా ప్రీమియర్ లీగ్లో కలకలం సృష్టించింది.

నోబాల్స్ వివాదం ముదురుతున్న సమయంలో షోయబ్ మాలిక్ మెల్లగా జారుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటించి దుబాయ్కు వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫార్చ్యాన్ బరిషల్ అతడి కాంట్రాక్ట్ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. షోయబ్ మాలిక్ ఆట పరంగానే కాకుండా వ్యక్తిగత నిర్ణయాలతోనూ విమర్శలపాలయ్యాడు. ఇటీవల మాలిక్ మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
సానియా మీర్జాను షోయబ్ మాలిక్ 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికీ షోయబ్కు అది రెండో వివాహం కావడం గమనార్హం. తన తొలి భార్య అయేషా సిద్ధిఖితో విడాకుల అనంతరం సానియాను పెళ్లి చేసుకున్నాడు. తాజాగా పాకిస్థాన్ ప్రముఖ నటి సనా జావేద్ను మాలిక్ వివాహమాడాడు. సనా జావేద్కు ఇది రెండో వివాహం. పాకిస్తాన్ కు చెందిన ఈ ప్రముఖ నటీ వయసు 28 ఏళ్లు. 2020లో సింగర్ ఉమైర్ జస్వాల్ను ఆమె వివాహం చేసుకుంది. కానీ కొద్దికాలానికే ఈ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి.
అయితే షోయబ్ మాలిక్ మూడో పెళ్లి వేడుకకు అతని కుటుంబ సభ్యులు హాజరవ్వలేదని పాకిస్థాన్ మీడియాలో కథనాలు వచ్చాయి. కాగా, సనా జావెద్ను పెళ్లి చేసుకోవడం మాలిక్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, సానియా మీర్జాతో విడాకులు తీసుకోవడాన్ని వారు సహించలేదని వార్తలు వచ్చాయి.