
భారత్లో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా వరుసగా రెండు మ్యాచులు ఓడింది. తొలి టెస్టులోనే ఆ జట్టు ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఢిల్లీలో తొలి ఇన్నింగ్స్లో కొంత ఫర్వాలేదనిపించిన ఆసీస్ బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్లో పూర్తిగా చేతులెత్తేశారు. జడేజా దెబ్బకు విలవిల్లాడారు. జడ్డూ మాయాజాలం ముందు ఏమాత్రం నిలబడలేక కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయిపోయారు. ఈ మ్యాచ్లో ఆసీస్ బ్యాటర్ల ఆటతీరుపై ఆ దేశ మాజీ దిగ్గజాలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ లెజెండ్ అలన్ బోర్డర్ కూడా ఆసీస్ బ్యాటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత బౌలింగ్ చూసి ఆసీస్ బ్యాటర్లు బెదిరిపోయారని, అందుకే నిర్లక్ష్యంగా స్వీప్ షాట్లు ఆడి అవుటయ్యారని మండిపడ్డాడు. 'వాళ్లు ఆడిన విధానం చూస్తుంటేనే ఒళ్లు మండిపోతోంది. భయంతో వణుకుతూ, ఏం చేయాలో తెలియక ఏదో చేసేయాలనే తొందరలో తడబడిపోయారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వెయ్యడానికి ఒక్కళ్లు కూడాప ప్రయత్నించలేదు. సరైన డిఫెన్సివ్ క్రికెట్ ఒక్కరు కూడా ఆడలేదు' అని బోర్డర్ చెప్పాడు.

అక్కడితో ఆగకుండా ఆసీస్ ఆటగాళ్లందరూ ప్రతి బంతికీ స్వీప్ షాట్ లేదా రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించి అవుటయ్యారని అసహనం వ్యక్తం చేశాడు. 'మీరేం ఫ్లాట్ రోడ్డులాంటి పిచ్పై ఆడట్లేదు కదా. ఆటను సాగదీయడానికి. కష్టమైన పిచ్పై ఆడేటప్పుడు ఎలాంటి షాట్లతో పరుగులు చేయొచ్చో గుర్తించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా క్రీజులో కాసేపు బ్యాటింగ్ చేయాలి' అని విసుర్లు విసిరాడు బోర్డర్.
చాలా కాలంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచేందుకు ఆసీస్ ప్రయత్నిస్తోంది. కానీ 2014-15లో ఈ సిరీస్ గెలిచిన ఆసీస్.. ఆ తర్వాత మళ్లీ ఈ ట్రోఫీ అందుకోలేదు. కోహ్లీ హయాంలో ఆస్ట్రేలియా వెళ్లి కూడా రెండుసార్లు ఈ సిరీస్ గెలిచి వచ్చింది టీమిండియా. దీంతో అప్పటి నుంచి ఎలాగైనా ఈ సిరీస్ గెలవాలని ఆసీస్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.