బెంగళూరు: అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్-షేన్ వార్న్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న 'క్రికెట్ ఆల్ స్టార్స్ సిరీస్'లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అయితే ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే అమెరికాలో వచ్చే నెలలో జరగనున్న ఈ సిరీస్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనర్లుగా దిగే అవకాశం ఉంది. గత వారమే అంతర్జాతీయ క్రికెట్ తోపాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్కు సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం సెహ్వాగ్ రంజీ ట్రోఫీలో హర్యానా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా, అక్టోబర్ 27న సెహ్వాగ్.. ఆల్ స్టార్స్ సిరీస్లో ప్రవేశించాడని సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. గతంలో అనేక అంతర్జాతీయ మ్యాచుల్లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఈ ద్వయం మళ్లీ ఈ టోర్నీ ద్వారా ఓపెనర్లుగా మైదానంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
'నా స్నేహితుడా..నీకు ఆల్ స్టార్స్ సిరీస్లోకి ఘన స్వాగతం' అంటూ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. షేన్ వార్న్ కూడా సెహ్వాగ్కు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశాడు. న్యూయార్క్లో కలుసుకుందామని పేర్కొన్నాడు.
అమెరికాలో ఈ సిరీస్లో భాగంగా మూడు మ్యాచులు జరగనున్నాయి. సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్ జట్లు తలపడతాయి. నవంబర్ 7న న్యూయార్క్లో తొలి మ్యాచ్ జరగనుంది.
ఈ సిరీస్లో ఇప్పటికే సౌరవ్ గంగూలీ, బ్రియాన్ లారా, జాక్వెస్ కల్లిస్, రికీ పాంటింగ్, కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, ముత్తయ్య మురళీ ధరన్, వివిఎస్ లక్ష్మణ్ లాంటి మాజీ దిగ్గజ ఆటగాళ్లు తమ పేరు నమోదు చేసున్నారు.