
ఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దాని ప్రభావం ఒక్కో రంగంపై తీవ్ర ప్రభావం చూపుతూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వర్తకం, వాణిజ్యం, ఔషధ, పర్యాటక రంగాలను దాటి క్రీడా రంగంపై పడింది. కరోనా కారణంగా ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని అదే బాట పడుతున్నాయి. కరోనా సెగ ఇప్పుడు బీసీసీఐని కూడా తాకింది.
కరోనా వైరస్ దేశంలో వేగంగా వ్యాప్తిచెందడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్-19ను మహమ్మారిగా ప్రకటించడంతో జనాలు గుమిగూడకుండా ఉండేందుకు ఐపీఎల్ను ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. భారత్, దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక వన్డే సిరీస్నూ రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దేశవాళీ టోర్నీలు అన్నింటినీ బీసీసీఐ తాత్కాలికంగా రద్దు చేసింది. ఈనెల 18వన ఆరంభం కావాల్సిన ఇరానీ కప్తో సహా సీనియర్ వుమెన్స్ వన్డే నాకౌట్ టోర్నీ, విజ్జీ ట్రోఫీ, సీనియర్ వుమెన్స్ వన్డే చాలెంజర్, వుమెన్స్ అండర్-19 వన్డే నాకౌట్, వుమెన్స్ అండర్-19 టీ20 లీగ్ అన్ని టోర్నీలను వాయిదా వేసింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ దేశవాళీ టోర్నీల వాయిదా కొనసాగనుంది. ఈ మేరకు బీసీసీఐ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్ 2020, దేశవాళీ టోర్నీలతో పాటు టీమిండియా ఆడాల్సిన పలు టోర్నీలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుత పరిస్థితి నుంచి ఉపశమనం లభించిన తర్వాతే టోర్నీల నిర్వహణపై ముందుడుగు వేయాలనేది బీసీసీఐ యోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రతీవారం కరోనా వైరస్పై సమీక్ష నిర్వహించనున్నారు. దాంతో బీసీసీఐ తాత్కాలికంగా షట్డౌన్ అయినట్లే.
ఇదిలా ఉంటే.. శనివారం ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమానులు, బీసీసీఐ సమావేశం జరిగింది. ప్రస్తుత పరిస్థితులు, టోర్నీ నిర్వహణ విషయాలపై ఈ సమావేశంలో చర్చించారని సమాచారం తెలుస్తోంది. ఈ సమావేశంలో నెస్ వాడియా ( కింగ్స్ XI పంజాబ్), షారుఖ్ ఖాన్ (కోల్కతా నైట్రైడర్స్), ఆకాశ్ అంబాని (ముంబై ఇండియన్స్), పార్థ్ జిందాల్ (డిల్లీ క్యాపిటల్స్) సహా ఫ్రాంచైజీల యాజమానులు అందరూ పాల్గొన్నారట. మరోవైపు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షాతో ఫ్రాంచైజీల యాజమానులు చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏడు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో మినీ ఐపీఎల్కు కూడా అవకాశం ఉందట.