ఐపీఎల్ వేలం పూర్తయింది. కొందరు ఆటగాళ్లకు అనూహ్య ధర పలికింది. వారిలో ఒకరు వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్. అతడి కోసం ఆర్సీబీ ఏకంగా రూ. 11.50 కోట్లు వెచ్చించింది. అయితే గణాంకాలు గొప్పగా లేని అల్జారీ జోసెఫ్ కోసం పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలంలో బెంగళూరు ఫ్రాంచైజీ మరోసారి నిరాశపరిచిందని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
అయితే సౌతాఫ్రికా టీ20 లీగ్లో డుప్లెసిస్ కెప్టెన్సీలో అల్జారీ జోసెఫ్ ఆడాడు. ఆ లీగ్లో మెరుగ్గా రాణించినందకు అతడిని కొనుగోలు చేశామని, ముందుగానే జోసెఫ్ కోసం ప్లాన్ చేశామని ఆర్సీబీ ఫ్రాంచైజీ చెప్పుకొచ్చింది. కానీ అది చెత్త నిర్ణయమే అని బెంగళూరుపై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి.

మరోవైపు వెస్టిండీస్ అల్జారీ జోసెఫ్ను వైస్ కెప్టెన్గా నియమించింది. ఆస్ట్రేలియాలో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ కోసం వెస్టిండీస్ సెలక్టర్లు జట్టును ఎంపిక చేశారు. 15 మందితో కూడిన ఈ జట్టుకు కెప్టెన్గా బ్రాత్వైట్, వైస్ కెప్టెన్గా అల్జారీ జోసెఫ్ను ఎంపిక చేసింది. ఈ వార్తతో జోసెఫ్ స్టార్ పేసర్ కాకపోయినా, నాణ్యమైన బౌలరే అంటూ.. ఆర్సీబీ ఫ్రాంచైజీ నిర్ణయం సరైనదేనని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
అయితే వెస్టిండీస్ ప్రకటించిన జట్టులో ఏకంగా ఏడుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉండటం గమనార్హం.కొందరు కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల యువ ప్లేయర్లను తీసుకున్నామని చీఫ్ సెలక్టర్ పేర్కొన్నాడు. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జనవరి 17 నుంచి తొలి టెస్టు జరగనుంది. జనవరి 25 నుంచి గబ్బా వేదికగా రెండో టెస్టు పింక్ బాల్తో జరుగుతుంది.
కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో బెంగళూరు అల్జారి జోషెఫ్ (రూ.11.50 కోట్లు), యశ్ దయాల్ (రూ.5 కోట్లు), ఫెర్గూసన్ (రూ.2 కోట్లు), టామ్ కరన్ (రూ.1.50 కోట్లు), సౌరభ్ చౌహాన్ (రూ.20 లక్షలు), స్వప్నిల్ సింగ్ (రూ.20 లక్షలు)ను దక్కించుకుంది.