మెల్బోర్న్: ఐసీసీ ప్రపంచ కప్ 15 లో అంపైర్ల తీరు కొన్నిసార్లు విమర్శలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. మెల్బోర్న్లో భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లోను ఎంపైర్ తీరు విమర్శలకు దారి తీసింది. భారత్ - బంగ్లాదేశ్ల మధ్య క్వార్టర్ ఫైనల్ సందర్భంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండగా.. ఎంపైర్ తీరు వివాదానికి తావిచ్చింది.
మూడు వికెట్లు కోల్పోయి రైనా, రోహిత్ శర్మలు దూకుడుగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ 90 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతనికి లైఫ్ లభించింది. రూబెల్ బౌలింగులో మిడ్ వికెట్ మీదుగా రోహిత్ కొట్టి షాట్కు బంతి గాలిలోకి లేచింది. దానిని ఫీల్డర్ క్యాచ్ అందుకున్నాడు.
అయితే, ఆ బాల్ను రూబెల్ నడుము కన్నా ఎత్తులో వేశాడని చెబుతూ ఎంపైర్ ఆ బాల్ను నో బాల్గా ప్రకటించాడు. దీంతో రోహిత్కు లైఫ్ లభించింది. కాగా, ఆ బాల్ను నోబాల్గా ప్రకటించింది... పాకిస్తాన్కు చెందిన అనుభవజ్ఞుడైన, అవార్డ్ విన్నింగ్ ఎంపైర్ అలీమ్ ధర్.
దర్ స్క్వేర్ లెగ్లో ఉన్నాడు. ఆ బంతి రోహిత్ శర్మ నడుము కంటే ఎత్తుకు వెళ్లిందని చెప్పాడు. రిప్లేలో మాత్రం రూబెల్ డెలివరీ బీమర్ కాదని తేలింది. అప్పుడు రోహిత్ 90 పరుగుల వద్ద ఉండగా.. జట్టు స్కోర్ 3 వికెట్లకు 195 పరుగులు. 39.3 ఓవర్లు పూర్తయ్యాయి. ఇది 40వ ఓవర్లో నాలుగో బంతికి జరిగింది.

దీనిని నోబాల్గా ప్రకటించడంతో.. బంగ్లాదేశ్ ఒక వికెట్ నష్టపోయినట్లయింది. రోహిత్ ఆ బంతిని మిడ్ వికెట్ మీదుగా ఆడగా.. దానిని క్యాచ్ పట్టారు. ఆ తర్వాత రోహిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ 47 ఓవర్లో అవుటయ్యాడు. అహ్మద్ బౌలింగులో రోహిత్ శర్మ (126 బంతుల్లో 137 పరుగులు) అవుటయ్యాడు. అతను 14 ఫోర్లు, మూడు సిక్స్లు కొట్టాడు.
కాగా, ఎంపైర్ నిర్ణయం పట్ల స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. అతను ఆ సమయంలో కామెంటరీ చేస్తున్నాడు. కచ్చితంగా వికెట్ పోయిందని, బాల్ నడుము కంటే కిందుగానే వెళ్లిందని షెన్ వార్న్ చెప్పాడు. అలీమ్ ధర్ విశ్వాసాన్ని కోల్పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇది నోబాల్ కాదని ట్వీట్ చేశాడు. ఇది సరైన నిర్ణయం కాదని చెప్పాడు. రోహిత్ శర్మకు లక్కీ బ్రేక్ వచ్చిందన్నాడు. ఈ నిర్ణయం మరో 20 పరుగులు చేసేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.