హైదరాబాద్: ఇంగ్లాండ్కు చిరస్మరణీయ విజయాలను అందించిన అలెస్టర్ కుక్ టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారిక ప్రకటన చేసింది. '59 టెస్టులకు కెప్టెన్గా ఉన్న అలెస్టర్ కుక్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగాడు' అని ఈసీబీ తన వెబ్సైట్లో పేర్కొంది.
ఆగస్టు 2012లో ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు కుక్ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. ఆ తర్వాత 2013లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరిస్లో ఇంగ్లాండ్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత టీమిండియా, దక్షిణాఫ్రికాలతో జరిగిన సిరిస్లలో ఇంగ్లాండ్ విజయం సాధించింది.

అత్యధిక టెస్టు మ్యాచ్లకు కెప్టెన్గా ఉన్న ఆటగాడిగా కూడా కుక్ రికార్డు సృష్టించాడు. ఇక 2010 నుంచి 2014 మధ్య కాలంలో 69 వన్డే మ్యాచ్లకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి ముందు తన నిర్ణయాన్ని ఆదివారం (ఫిబ్రవరి 5)న ఈసీబీ ఛైర్మన్ కోలిన్ గ్రేవ్స్తో చర్చించాడు.
కెప్టెన్సీ నుంచి వైదొలిగినా ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నట్లు ఈసీబీ పేర్కొంది. అలెస్టర్ కుక్ రాజీనామాను ఆమోదించిన ఈసీబీ త్వరలోనే ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు కెప్టెన్ను ఎంపికచేయనున్నట్లు తెలిపింది.
కెప్టెన్సీకి వైదొలగిన అనంతరం కుక్ మాట్లాడుతూ ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు కెప్టెన్గా ఉండటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, కెప్టెన్సీకి వీడ్కోలు పలకడమనేది కఠిన నిర్ణయమని చెప్పాడు. 'గత ఐదేళ్లుగా ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్గా ఉండటం గొప్ప గౌరవం. కెప్టెన్సీ నుంచి వైదొలగలడం కఠిన నిర్ణయం. ఏది ఏమైనా ఇదే సరైన నిర్ణయం, జట్టుకు ఇదే మంచిదే' అని కుక్ అన్నాడు.