రాజ్కోట్: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రాజ్కోట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో అలెస్టర్ కుక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు సరికొత్త రికార్డుని సృష్టించింది. 114/0 ఓవర్ నైట్ స్కోరుతో ఐదో రోజైన అదివారం ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ను 260/3 వద్ద డిక్లేర్ చేసింది.
ఆదివారం బ్యాటింగ్ను ఆరంభించిన ఇంగ్లాండ్ ఓపెనర్లు భారత్పై అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఓపెనర్లు అలెస్టర్ కుక్-హసీబ్ హమీద్లు జట్టుకు 180 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించి ఓ సరికొత్త రికార్డును నమోదు చేశారు. ఇదే భారత్లో ఆ జట్టు సాధించిన అత్యుత్తమ టెస్టు ఓపెనింగ్ భాగస్వామ్యంగా రికార్డు సాధించింది.
19 ఏళ్ల ఇంగ్లాండ్ ఓపెనర్ హసీబ్ హమీద్ రెండో ఇన్నింగ్స్లో 177 బంతులను ఎదుర్కొని ఒక సిక్స్, ఏడు బౌండరీలతో 82 పరుగులు చేసిన అద్భుతమైన ఓపెనింగ్ రాబట్టడంలో కీలకపాత్ర పోషించాడు. 1906లో కేప్ టౌన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ అటగాడు జాక్ క్రాఫర్డ్ చేసిన 74 పరుగుల రికార్డుని కూడా హమీద్ అధిగమించి రికార్డు నమోదు చేశాడు.

114/0 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ తొలి సెషన్ లో రెండు వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఓపెనర్లు అలెస్టర్ కుక్-హమీద్లు అత్యంత నిలకడగా ఆడారు. అయితే ఈ జోడీ 180 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం సాధించిన తరువాత హమీద్(82) వెనుదిరిగాడు.
ఫోటోలు: Cricket - England Tour Of India 2016-17
అమిత్ మిశ్రా బౌలింగ్లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి హమీద్ అవుటయ్యాడు. ఆ తరువాత కొద్దిసేపటికే జో రూట్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ బెన్ స్టోక్స్ (29 నాటౌట్)తో కలిసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ను ఆడాడు.
ఈ క్రమంలోనే 194 బంతుల్లో 10 ఫోర్లు సాయంతో కుకు సెంచరీని సాధించాడు. టెస్టుల్లో ఇది కుక్కు 30వ సెంచరీ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అత్యధిక ఇంగ్లాండ్ టెస్టు ఓపెనింగ్ భాగస్వామ్యం గ్రేమ్ ఫావ్లర్-రాబిన్స్ల పేరిట ఉంది. 1985లో చెన్నైలో వీరిద్దరి జోడి నమోదు చేసిన 178 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యమే ఈరోజు వరకూ భారత్లో ఇంగ్లాండ్ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.
మరోవైపు మొత్తంగా చూస్తే భారత్లో ఇది రెండో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం. గతంలో టీమిండియా ఓపెనర్లు గౌతం గంభీర్-వీరేంద్ర సెహ్వాగ్లు స్వదేశంలో సాధించిన 182 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం మొట్టమొదటి స్ధానంలో ఉంది.
ఈ రికార్డుని కేవలం రెండు పరుగుల తేడాతో కుక్-హమీద్ జోడీ కోల్పోయింది. ఇక 194 బంతుల్లో 10 ఫోర్లు సాయంతో సెంచరీ చేసిన కెప్టెన్ కుక్ భారత్లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. కుక్కు ఇది భారత్లో ఐదో టెస్టు సెంచరీ.