న్యూఢిల్లీ: బంగ్లాదేశ్తో మిర్పూర్లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ బౌలర్ బెన్ స్టోక్స్కు జరిమానా విధించడంపై ఆ జట్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. రెండో టెస్టులో ఇంగ్లాండ్కు చెందిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఐసీసీ నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మిర్పూర్లో జరిగిన రెండో టెస్టులో ఆదివారం మార్నింగ్ సెషన్లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ షబ్బిర్ రెహ్మాన్తో బెన్ స్టోక్స్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో అంపైర్లు (కుమార ధర్మసేన, ఎస్ రవి) కలగజేసుకుని బెన్ స్టోక్స్కు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు.
అంఫైర్లు మాట పట్టించుకోకుండా రెహ్మాన్తో స్టోక్స్ మాటల యుద్ధానికి దిగాడు. దీంతో మ్యాచ్ అనంతరం స్టోక్స్ కు మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. దీనిని కుక్ తప్పుబట్టాడు. ఆటలో సర్వసాధారణంగా వాగ్వాదాలు చోటు చేసుకుంటాయని స్టోక్స్ ప్రవర్తనను సమర్ధించాడు.
మైదానంలో జరిగిన ఈ వాగ్వాదంపై అంఫైర్లు అతిగా స్పందించారని ఆరోపించాడు. తనకి కూడా ఇది కొంత అసంతృప్తికి గురి చేసినట్లు పేర్కొన్నాడు. 'స్టోక్స్, రహీమ్ ఇద్దరూ కాంపిటేటివ్ క్రికెటర్లు. నా వరకూ అయితే ఆ వాగ్వాదాన్ని ప్రజలు కూడా ఆహ్వానిస్తారు. అభిమానులకూ అదే కావాలి' అని కుక్ తెలిపాడు.
'కొన్ని సార్లు అంఫైర్లు వెంటనే కలగజేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఏది ఏమైనా స్టోక్స్కు జరిమానా వేయడం నన్ను కాస్త నిరాశకు గురి చేసింది' అని అలెస్టర్ కుక్ పేర్కొన్నాడు. రెండో టెస్టు చివరి రోజైన అదివారం రెహ్మాన్ని స్టోక్స్ పదే పదే రెచ్చగొట్టాడు.
దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. దీనిపై ఆన్ ఫీల్డ్ అంపైర్లు పలుమార్లు స్టోక్స్ను మందలించినా పద్ధతి మార్చుకోకుండా మరోసారి రెచ్చగొట్టాడు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా కావడంతో వారు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. దీంతో మ్యాచ్ రిఫరీ స్టోక్స్కు జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.