
హైదరాబాద్: ఇండోర్ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీలో విదర్భ జట్టు ఆల్రౌండ్ షోతో అదరగొడుతోంది. బౌలింగ్లో గుర్బానీ చెలరేగి ఢిల్లీని కట్టడి చేయగా, ఇప్పుడిక బ్యాటింగ్లోనూ సత్తా చాటడంతో రంజీ ఫైనల్పై ఆ జట్టు పట్టుబిగించింది.
వికెట్ కీపర్ అక్షయ్ వాడ్కర్ (243 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్తో 133 బ్యాటింగ్) సెంచరీతో రాణించడంతో ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 528 పరుగులు సాధించింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఢిల్లీపై 233 పరుగుల ఆధిక్యం లభించింది.
వాడ్కర్తో పాటు నెరాల్ (56) పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఓవర్నైట్ స్కోరు 206/4తో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ వసీం జాఫర్ (78) వికెట్ను త్వరగానే కోల్పోయింది. ఆ తర్వాత హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆదిత్య సర్వాతే (79)తో కలిసి ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
వీరిద్దరి ఏడో వికెట్కు 169 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పగా... నెరాల్తో కలిసి ఎనిమిదో వికెట్కు 113 పరుగులు జోడించాడు. ఈ సీజన్లో అరంగేట్రం చేసిన అక్షయ్ తన ఐదో మ్యాచ్లో తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించాడు. మూడో రోజు 322 పరుగులు చేసిన విదర్భ.. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది.
నవదీప్ సైనీకి మూడు, ఆకాశ్ సుడాన్కు రెండు వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్లో ఢిల్లీ 295 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ జట్టు పేలవ ఫీల్డింగ్కు తోడు పలు క్యాచ్లు కూడా వదిలేసి మూల్యం చెల్లించుకుంది.
ఉదయం 9 గంటల నుంచి స్టార్స్పోర్ట్స్ 1లో