ఇంగ్లాండ్ తో తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించడంలో శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ కీలకంగా వ్యహరించారు. అయితే వీరిలో శ్రేయస్ అయ్యర్.. విరాట్ కోహ్లీ కి మోకాలి వాపు కారణంగా తుది జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో వన్డే కోసం విరాట్ రెడీ అవ్వడంతో మళ్లీ అయ్యర్ ను పక్కన పెట్టనున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో స్పందించిన పలువురు మాజీ క్రికెటర్లు.. ఇది సరైన తీరు కాదని విమర్శిస్తున్నారు.
ఎలా పక్కన పెడతారయ్యా?
"శ్రేయస్ అయ్యర్ తన స్థానంపై గురించి చేసిన వ్యాఖ్యలను తీసుకోవాడనికి ప్రయత్నిస్తున్నాను. కోహ్లీ ఫిట్గా లేడని శ్రేయస్ అయ్యర్ కు ఛాన్స్ వచ్చింది. అయితే, వన్డే వరల్డ్ కప్లో నాలుగో స్థానంలో దిగి 500కు పైగా పరుగులు చేసిన తొలి టీమిండియా బ్యాటర్ అతడు. అలాంటోడిని ఎలా బెంచ్కు పరిమితం చేస్తారు? ఒకవేళ అతడు ఆడకపోతే సెకండ్ డౌన్లో ఎవరొస్తారు? విరాట్ కోహ్లీ ఏమైనా ఆడతాడా? లేదంటే గిల్ను నాలుగో స్థానంలోకి పంపిస్తారా?" అంటూ ఆకాశ్ చోప్రా ప్రశ్నించాడు.

"జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. "ప్రతి ఒక్కరూ శ్రేయస్ ఇన్నింగ్స్ గురించి చర్చిస్తున్నారు. కానీ నిజానికి అతడు ఎదురుదాడి చేసిన తీరు అద్భుతం. అయ్యర్ క్రీజులోకి వచ్చే సమయానికి.. భారత జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. అలాంటి సమయంలో ఎవరైనా క్రీజులోకి వస్తే కాస్త నెమ్మదిగా ఆడుతుంటారు. కానీ, శ్రేయస్ అలా చేయలేదు. అతడి ఆత్మవిశ్వాసం అద్భుతం. ప్రత్యర్థిపై దూకుడుగా ఆడాడు. అస్సలు వెనకడుగు వేసేదే లేదంటూ దూసుకుళ్లాడు. జట్టు విజయం సాధించడానికి కారణం గిల్, అయ్యర్ భాగస్వామ్యం. కాబట్టి సూపర్ ఫామ్లో ఉన్న బ్యాటర్ను పక్కనపెట్టడం కరెక్ట్ కాదు" అని జహీర్ పేర్కొన్నాడు.