ఐపీఎల్-2025 సీజన్లో ముంబై ఇండియన్స్ వైఫల్యాలు కొనసాగుతున్నాయి. మొదటి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్పై ఓటమితో సీజన్ ను ప్రారంభించిన ముంబై జట్టు.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలోనూ ఓడింది. కానీ మూడో మ్యాచులో కేకేఆర్ పై విజయం సాధించి గెలుపు బాటలోకి వచ్చిందనుకుంటే.. మళ్లీ తాజాగా జరిగిన మ్యాచులో లక్నోపై 12 పరుగుల తేడాతో ఓడింది.
ఈ మ్యాచులో బంతితో (5/36) స్టార్ ఆఫ్ ది షోగా నిలిచిన హార్దిక్ పాండ్య మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి లక్నో (203) ఎక్కువ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. వైవిధ్యమైన బంతులు వేసి.. ఎల్ఎస్జీని గట్టిగానే దెబ్బ తీశాడు. తద్వారా ఐదు వికెట్లు తీసిన తొలి ఐపీఎల్ కెప్టెన్ గా అరుదైన రికార్డ్ సాధించాడు.

లక్ష్య ఛేదనలో ముంబయి ఓపెనర్లు త్వరగానే వికెట్లు కోల్పోయినప్పటికీ.. నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడి ముంబయిని ముందుకు నడిపించారు. ఆ తర్వాత జట్టు విజయానికి దగ్గర వచ్చిన సమయంలో తిలక్ వర్మ ధాటిగా ఆడలేకపోయాడు. దీంతో అనూహ్యంగా మ్యాచ్ ముగియడానికి ఏడు బంతులు మిగిలి ఉండగా... తిలక్ వర్మను రిటైర్డ్ ఔట్గా వెనక్కి పిలిపించింది ముంబయి. ఈ నిర్ణయంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
మిచెల్ శాంట్నర్ ను క్రీజులోకి పంపాడు హార్దిక్. అతడు రెండు పరుగులే చేశాడు. హార్దిక్ చివరి ఓవర్ మొదటి బంతికి సిక్స్ బాది జోష్ నింపాడు. కానీ ఆ తర్వాత ఫెయిల్ అయ్యాడు. మూడో బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా నిరాకరించాడు. నాలుగో బంతి డాట్ అయింది. ఇక ఐదో బంతికి హార్దిక్ సింగిల్ తీసి.. మరో ఎండ్ లో ఉన్న శాంట్నర్ ను క్రీజులోకి పంపాడు. ఆఖరి బంతికి శాంట్నర్ పరుగులేమి చేయలేదు. దీంతో 12 పరుగులు తేడాతో ముంబయి పరాజయాన్ని అందుకుంది.
అయితే, చివరి ఓవర్ లో ముంబయి జట్టు ప్రదర్శన, తీసుకున్న నిర్ణయంతో ఆకాశ్ అంబానీ కాస్త అసంతృప్తికి గురైనట్లు అర్థమైంది. ఆ సమయంలో ఆకాశ్ ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ పరాజయం తర్వాత జట్టు సభ్యులతో సీరియస్ గా చర్చించాడు ఆకాశ్ అంబానీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.