
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన చూసి అసలు బాధపడనని ఆ ఫ్రాంఛైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ అన్నారు. గత నాలుగేళ్లలో మూడుసార్లు ట్రోఫీలు సాధించడం అంత ఆషామాషీ కాదన్నారు. ఇక రాబోయే రెండేళ్లు కూడా ఎలా ఆడతామనే విషయంపై తమకు ఎంతో నమ్మకం ఉందని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. వరుసగా రెండేళ్లు (2019, 2020) విజేతగా నిలిచిన ముంబై.. ఈసారి త్రుటిలో ప్లే ఆఫ్స్ అవకాశాన్ని కోల్పోయింది. లీగ్ దశలో కోల్కతా నైట్ రైడర్స్తో సమానంగా 14 పాయింట్లతో నిలిచినా.. రన్రేట్ మెరుగ్గా లేకపోవడంతో ఐదో స్థానంలో నిలిచింది. దీంతో కోల్కతా నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. ఈ రోజు ఎలిమినేటర్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
సన్రైజర్స్ హైదరాబాద్తో అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సమిష్టిగా రాణించిన ముంబై 42 పరుగుల తేడాతో హైదరాబాద్ను ఓడించింది. ముంబై విజయాన్ని అందుకున్నా.. ప్లే ఆఫ్ బెర్త్ మాత్రం దక్కలేదు. మెరుగైన రన్ రేట్ ఉన్న కోల్కతాకే నాలుగో స్థానం దక్కింది. ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ముంబై ప్లే ఆఫ్కి చేరాలంటే 171 పరుగుల భారీ తేడాతో హైదరాబాద్ను ఓడించాల్సి ఉంది. అంటే సన్రైజర్స్ జట్టును 65 పరుగులకే కట్టడి చేయాలి. కానీ ఓపెనర్ జాసన్ రాయ్ చెలరేగడంతో ఎస్ఆర్హెచ్ ఆరో ఓవర్ మూడో బంతికే 64 పరుగులు చేసింది. దాంతో ముంబై ఆశలకు తెరపడింది.
రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 2013 నుంచి 2019 వరకు ఏడాది తప్పిచ్చి ఏడాది వరుసగా నాలుగుసార్లు టైటిల్ సాధించింది. ఈ క్రమంలోనే గతేడాది యూఏఈలో ఆ సంప్రదాయాన్ని బద్దలుకొట్టి ఐదు సార్లు విజేతగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో ఈసారి కూడా ఛాంపియన్స్గా అవతరించి హ్యాట్రిక్ సాధిస్తుందని ఫాన్స్ ఆశించగా.. పూర్తిగా నిరాశపర్చింది. లీగ్ ఆరంభం నుంచే రోహిత్ సేన తడబడింది. ఇక పలు కీలక మ్యాచ్ల్లో ఓటమిపాలై ప్లే ఆఫ్స్కు చేరుకోలేకపోయింది.
తాజాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ... 'ఈ నాలుగేళ్లలో మూడుసార్లు ట్రోఫీలు సాధించడం అంత ఆషామాషీ కాదు. రాబోయే రెండేళ్లు కూడా ఎలా ఆడతామనే విషయంపై మాకు ఎంతో నమ్మకం ఉంది. ఈ సీజన్ ఫలితాలు చూసి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే ముంబై అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. మీ అందరికీ కృతజ్ఞతలు. ముంబై ఇండియన్స్ తరఫున ప్రతి ఒక్కరు సమష్టిగా రాణించారు. ఇలాంటి జట్టుని కలిగి ఉండటం మా అదృష్టం. మీరంతా ఒక కుటుంబంలా ఉన్నారు. భవిష్యత్లో ఎవరు ఎక్కడ ఉంటారనేది పక్కనపెడితే.. ముంబై మిమ్మల్ని ఎప్పుడూ ఒకేలా చూస్తుంది' అని పేర్కొన్నారు.