
హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదం ముగిసింది. ఈ బాల్ టాంపరింగ్కు పాల్పడిన స్మిత్, వార్నర్, బాన్క్రాప్ట్లకు విచారణ అనంతరం క్రికెట్ ఆస్ట్రేలియా శిక్షను కూడా ఖరారు చేసింది. ఈ వివాదంలో కీలకపాత్ర పోషించిన ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్పై రెండేళ్లపాటు నిషేధం విధించింది.
బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన కామెరాన్ బాన్క్టాఫ్ట్పై తొమిది నెలల నిషేధం విధించింది. ఇక, ఇప్పుడు అందరి చూపు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్పై పడింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఐపీఎల్ నిర్వాహాకులు సిద్ధం చేశారు.

మరోవైపు అన్ని జట్లకు చెందిన ప్రాంఛైజీలు ఆటగాళ్ల కోసం ట్రైనింగ్ క్యాంపులను కూడా ప్రారంభించాయి. ఆటగాళ్లు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ ట్రైనింగ్ క్యాంపుల్లో పాల్గొంటున్నారు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు గన్సోలిలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్లో శిక్షణ తీసుకుంటున్నారు.
ముంబై ఇండియన్స్ యజమాని ముకేశ్-నీతా అంబానీల కుమారుడు ఆకాశ్ అంబానీ బుధవారం ముంబై ఇండియన్స్ క్యాంపుని సందర్శించాడు. ఈ సందర్భంగా ఆ జట్టు హెడ్ కోచ్ మహిళా జయవర్దనే ఆకాశ్కు ఆటగాళ్లను పరిచయం చేశాడు. ఆ తర్వాత అందరితో కాసేపు మాట్లాడిన ఆకాశ్ అక్కడి సదుపాయాలను అడిగి తెలుసుకున్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియోని ముంబై ఇండియన్స్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ ఏప్రిల్ 7న ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగే తొలి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్కింగ్స్తో తలపడనుంది.