
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వేలం గురువారం చెన్నైలో ఘనంగా ముగిసింది. వేలంలో పలువురు ఆటగాళ్లు అనూహ్య ధర పలకగా.. మరికొందరు ఊహించిన దానికంటే మరీ తక్కువ మొత్తానికి పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా పేస్ ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్లతో ఐపీఎల్లో నయా రికార్డు తన పేరిట రాసుకున్నాడు. ఇక ఇంగ్లండ్ టీ20 స్పెసలిస్ట్, వరల్డ్ నంబర్వన్ టీ20 ఆటగాడైన డేవిడ్ మలన్కు షాక్ తగిలింది. వేలంలో మలన్ను రూ.1.5 కోట్లకే పంజాబ్ కింగ్స్ సునాయాసంగా దక్కించుకుంది.
ఐపీఎల్ 2021 వేలంలో తొలిసారి పాల్గొన్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్పై అభిమానులు ఆసక్తి చూపించారు. అతడిని ఎవరు తీసుకుంటారు? ఎంత మొత్తం ధర పలుకుతాడనే విషయాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. వేలం చివరివరకు అతడి పేరు రాలేదు. అయితే అందరూ ఊహించినట్లే ముంబై ఇండియన్స్ అర్జున్ను తన కనీస ధర రూ.20 లక్షలకే కొనుగోలు చేసింది. ఇతర జట్లు అతడిపై పడగ ఆసక్తి చూపలేదు. దీంతో తొలిసారి వేలంలో పాల్గొన్న అర్జున్ సొంతగూటికే చేరాడని అభిమానులు భావిస్తున్నారు.
గురువారం సాయంత్రం వేలం ముగిశాక అర్జున్ టెండూల్కర్ మాట్లాడిన ఓ వీడియోను ముంబై ఇండియన్స్ టీమ్ తమ ట్విటర్లో పంచుకుంది. 'చిన్నప్పటి నుంచి నాకు ముంబై ఇండియన్స్ జట్టంటే ఎంతో ఇష్టం. ఈ సందర్భంగా నాపై నమ్మకం ఉంచిన కోచ్లకు, జట్టు యాజమాన్యానికి, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ జట్టుతో కలిసి ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని అర్జున్ పేర్కొన్నాడు. అతడిని తమ జట్టులోకి తీసుకోవడంపై ముంబై టీమ్ యజమాని ఆకాశ్ అంబానీ సైతం ఓ వీడియోలో మాట్లాడారు.
'అర్జున్ నైపుణ్యాల గురించి మా కోచింగ్ సిబ్బంది మహేల జయవర్ధనె, జహీర్ ఖాన్ ముందే చెప్పారు. సచిన్ తనయుడు ఎడమ చేతి వాటం ఫాస్ట్బౌలర్, బ్యాట్స్మన్ అని వివరించారు. ప్రపంచ క్రికెట్లో ఇలా ఎక్కువ మంది లేరని చెప్పారు. ఇతర యువ ఆటగాళ్లలాగే అర్జున్ కూడా ఈ స్థాయికి చేరుకున్నాడు. జట్టులో ఆటగాళ్లకు తగిన స్వేచ్ఛ ఇచ్చి వారిలోని అత్యుత్తమ నైపుణ్యాలను బయటకు తెస్తాం. అయితే అదంతా ఆయా ఆటగాళ్లు కష్టపడటంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకోసం తగిన ఏర్పాట్లు తాము చేస్తాం. భవిష్యత్లో అర్జున్ కూడా ఇతరుల్లాగే మెరుగైన క్రికెటర్గా తయారవుతాడు' అని ఆకాశ్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే: కౌల్టర్నైల్ (రూ.5 కోట్లు), ఆడమ్ మిల్నె (రూ.3.2 కోట్లు), పియూష్ చావ్లా (రూ.2.4 కోట్లు), జేమ్స్ నీషమ్ (రూ.50 లక్షలు), యుధ్వీర్ (రూ.20 లక్షలు), జాన్సన్ (రూ.20 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ.20 లక్షలు).