
హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లోని అవినీతి నిరోధక విభాగ అధినేతగా రాజస్థాన్ మాజీ డీజీపీ అజిత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీర్జ్ కుమార్ ఈ బాధ్యతలను నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. శనివారంతోనే నీరజ్ కుమార్ పదవీకాలం ముగిసింది. అయితే ఐపీఎల్-11 సీజన్ నేపథ్యంలో మే 31 వరకు నీరజ్ కుమార్ను ఏసీయూ సలహాదారుగా నియమించారు.
అంతకుముందు అజిత్ సింగ్ నియామకంపై సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ), బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి మధ్య రగడ చెలరేగింది. తన ప్రమేయం లేకుండానే అజిత్ నియామకం జరిగిందని అమితాబ్ చౌదరి విమర్శించారు. అయినప్పటికీ కార్యదర్శి ప్రమేయం లేకుండానే సింగ్ నియామాకాన్ని వినోద్ రాయ్ ఆమోదించారు.
1982 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన అజిత్సింగ్ రాజస్థాన్ డీజీపీగా పనిచేశారు. నవంబర్ 30, 2017న పదవీ విరమణ చేశారు. పోలీసు శాఖలో దాదాపు 36ఏళ్ల పాటు ఆయన పనిచేశారని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. పలు అవినీతి నిరోధక ఆపరేషన్స్తో పాటు కేసుల విచారణ, క్షేత్రస్థాయిలో పోలీసింగ్ వంటి అంశాల్లో ఆయనకు ఎంతో విలువైన అనుభవం ఉంది.
రాజస్థాన్ అవినీతి నిరోధక శాఖలో నాలుగేళ్ల పాటు పనిచేశారని వెల్లడించింది. ఐపీఎల్ ప్రారంభం కంటే ముందే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. గతంలో మాదిరే ఐసీసీ అవినీతి నిరోధక విభాగం సేవలనూ ఉపయోగించుకుంటామని బీసీసీఐ వివరించింది.