ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియా ఇప్పటి నుంచే రెడీ అవుతోంది. దశాబ్ద కాలంగా భారత జట్టు ఐసీసీ ట్రోఫీ నెగ్గడంలో విఫలమైన సంగతి తెలిసిందే. దీనిలో సెలెక్టర్ల పాత్ర కూడా ఉందన్న మాట వాస్తవం. కీలకమైన ఐసీసీ టోర్నీలకు ఎంపిక చేసే జట్ల విషయంలో సెలెక్టర్లు తపప్పుడు నిర్ణయాల వల్ల కూడా టీమిండియా బాగా దెబ్బతిన్నది.
అయితే ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని కొత్త చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భావిస్తున్నాడు. అందుకే వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులో కోర్ టీంను సెలెక్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాడట. దీని కోసం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మను కలిసేందుకు అగార్కర్ కూడా వెస్టిండీస్ బయలుదేరాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

కీలకమైన వన్డే వరల్డ్ కప్కు ఎంపిక చేసే 20 మంది బృందాన్ని ఫైనలైజ్ చేయాలని అగార్కర్ అనుకుంటున్నాడట. విండీస్తో మూడు వన్డేల సిరీస్ మొదలవడానికి ముందే ఈ డెసిషన్ తీసేసుకోవాలని అగార్కర్ ప్లాన్. ఈ వార్తలు నిజమేనంటూ బీసీసీఐకి చెందిన కొందరు చెప్తున్నారు. ప్రస్తుతం టీమిండియాతోపాటు సలీల్ అంకోలా కూడా విండీస్లో ఉన్నాడట.
టెస్టు సిరీస్ ముగియగానే అంకోలా తిరిగి స్వదేశానికి వచ్చేస్తాడని, అగార్కర్ అక్కడకు వెళ్లి టీంతో కలుస్తాడని సమాచారం. అయితే వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులో మరీ కొత్త మార్పులు ఏవీ ఉండవని తెలుస్తోంది. ఎందుకంటే ట్యాలెంట్ ఉన్న కుర్రాళ్లంతా ఆ టోర్నీ సమయంలోనే ఆసియా క్రీడల్లో ఆడుతుంటారు. కాబట్టి వాళ్లను వన్డే వరల్డ్ కప్ టీంకు ఎంపిక చేసే ఛాన్స్ లేదు.
వరల్డ్ కప్ ఆడే టీంలో జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా? అనేదే అతి పెద్ద ప్రశ్న. అయితే దాదాపు కోలుకొని ప్రాక్టీస్ సెషన్స్లో బౌలింగ్ చేస్తున్న బుమ్రా విషయంలో ఆసియా కప్ వరకు ఒక నిర్ణయం తీసుకోకపోవచ్చని సమాచారం. అలాగే తొడగాయంతో జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ను ఎంపిక చేయడంపై కూడా చర్చ జరగొచ్చు. వీళ్లిద్దరిపై మాత్రం ఆసియా కప్ తర్వాతే ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.