
ఢిల్లీ: ఎంతో నైపుణ్యం కలిగిన టీమిండియా యువ బ్యాట్స్మన్ రిషభ్ పంత్పై విమర్శలు రావడం నమ్మలేకపోతున్నా. పంత్పై అనవసర ఒత్తిడి పెరుగుతుంది, అది అతని ఆటపై ప్రభావం చూపుతుందని మాజీ పేసర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. పంత్ ప్రస్తుతం టీ20లో పరుగులు చేయలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వెస్టిండీస్ సిరీస్లో తనకు అలవాటైన చెత్త షాట్లకు ఔటైన సంగతి తెలిసిందే. పంత్ తన చివరి ఆరు ఇన్నింగ్స్లలో కేవలం 77 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఐదు సింగిల్ డిజిట్ స్కోర్లు ఉన్నాయి.
పంత్పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అజిత్ అగార్కర్ స్పందించాడు. 'మంచి ఇన్నింగ్స్లతో విదేశీ పర్యటనల్లో రెండు టెస్ట్ సెంచరీలు చేసిన ఎంతో నైపుణ్యం కలిగిన యువ ఆటగాడిపై చర్చలు జరగడం నమ్మలేకపోతున్నా. టీ20ల్లో ధాటిగా ఆడే క్రమంలో ఇబ్బందుల్లోకి వెళుతారు. కీలక సమయాల్లో షాట్లు ఆడవలసి ఉంటుంది. ఈ క్రమంలో అతడు ఆడాలనుకున్నట్లు ఆడలేకపోతున్నాడు' అని అగార్కర్ అన్నాడు.
'జట్టు పంత్ నుండి ఏం కోరుకుంటుందో కూడా నిర్ణయించుకోవాలి. నాలుగో స్థానంలో కొనసాగించాలనుకుంటున్నారా? లేదా ధాటిగా ఆడే విధంగా ఉండాలనుకుంటుందో తేల్చుకోవాలి. పంత్కు ఒక నిర్దిష్ట స్థానం కల్పించి, శ్రేయస్ అయ్యర్ని నాలుగో స్థానానికి పరిమితం చేయాలన్నాడు. పంత్ని లోయర్ మిడిల్ఆర్డర్లో ఆడించి సరైన అవకాశాలు ఇవ్వాలని, అలాచేస్తే స్వేచ్ఛగా ఆడతాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతితక్కువ అనుభవమున్న ఆటగాడిపై అనవసర ఒత్తిడి నెలకొంది. టీమిండియాకు విజయాల్ని అందించే సత్తా అతడికి ఉంది' అని అగార్కర్ చెప్పుకొచ్చాడు.
పంత్ ఇటీవల తనకు అలవాటైన లెగ్ సైడ్.. అనవసర షాట్లకు ప్రయత్నించి తరచూ వికెట్ కోల్పోతున్నాడు. దీంతో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా కోచ్ రవిశాస్త్రి సైతం పంత్ ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పంత్ను హెచ్చరించాడు. యువకుల నుండి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో పంత్ ఇప్పటికైనా పరుగులు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.