సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించడంలో తన ప్రమేయం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. ఇటీవల బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్లో ఇషాన్-శ్రేయస్లపై వేటు వేసిన విషయం తెలిసిందే. దేశవాళీ క్రికెట్ ఆడటానికి అశ్రద్ధ వహిస్తున్నారనే కారణంతో వారిద్దరిపై బీసీసీఐ కొరడా ఝుళిపించింది.
రంజీ ట్రోఫీ కంటే ఐపీఎల్లో ప్రాంఛైజీల తరఫున ఆడటానికి ఆసక్తి చూపించే యువ ఆటగాళ్లకు ఇది గుణపాఠం అని బీసీసీఐ నిర్ణయాన్ని కొందరు మాజీ క్రికెటర్లు మద్దతు ఇచ్చారు. దీన్ని మరికొందరు మాజీ క్రికెటర్లు తప్పుపట్టారు. ఆటగాళ్లందరిని సమానంగా చూడాలని, వైట్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడుతున్న హార్దిక్ పాండ్యకు ఎలా కాంట్రాక్ట్ ఇస్తారని ప్రశ్నించారు.

తాజాగా జై షా ఈ విషయాలపై మీడియాకు క్లారిటీ ఇచ్చాడు. యువ క్రికెటర్లపై వేటు వేయడానికి టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కారణం అని తెలిపాడు. చీఫ్ సెలక్టర్ ఆదేశాలను పాటించడమే తన విధి అని జై షా పేర్కొన్నాడు. ''రాజ్యాంగాన్ని ఒకసారి పరిశీలించండి. నేను సెలక్షన్ కమిటికీ కేవలం కన్వీనర్ మాత్రమే. దేశవాళీ క్రికెట్ ఆడని ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి తప్పించింది అజిత్ అగార్కర్. వాళ్ల నిర్ణయాన్ని అమలు చేయడమే నా పని''
''అయితే ఈ నిర్ణయం తీసుకునే సమయంలో సెలక్టర్లతో నేను మాట్లాడాను. ఈ వార్తలను మీడియా కూడా ప్రచారం చేసింది. ఇక హార్దిక్ పాండ్య విషయానికొస్తే.. బీసీసీఐతో అతను ఇలా చెప్పాడు. 'నా నుంచి వైట్ బాల్ క్రికెట్ను బీసీసీఐ ఆశిస్తుంటే, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలను ఆడటానికి సిద్ధంగా ఉన్నాను' అని తెలిపాడు. ప్రతి ప్లేయర్ ఆడాల్సి ఉంటుంది. ఆడాలని వాళ్లు కోరుకోపోయినా తప్పక ఆడాల్సిందే''
''ఐపీఎల్లో ఇషాన్ కిషన్లా రిలాక్స్గా ఆడవచ్చు. కానీ భారత జట్టులో అలా ఆడటం కుదరదు. తమని తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. వరుసగా ప్రదర్శనలు చేయాల్సి ఉంటుంది. అలా చేసే వ్యక్తినే సరైన ఆటగాడిని అంటారు'' అని జైషా పేర్కొన్నాడు.