టీమిండియా మాజీ ఆల్రౌండర్, ప్రస్తుతం భారత జట్టు చీఫ్ సెలెక్టర్గా వ్యవహరిస్తున్న అజిత్ అగార్కర్ తన పేరు మీద అనేక విశిష్ట రికార్డులను కలిగి ఉన్నారు. అజిత్ అగార్కర్ పుట్టినరోజు నేడు. అగార్కర్ 1977, డిసెంబర్ 4న ముంబైలో జన్మించారు. ప్రస్తుత భారత క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్లో నడుస్తున్న 'కోల్డ్ వార్'లో అజిత్ అగార్కర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై ఒత్తిడి తెచ్చి జట్టులో మార్పుల పేరుతో వారిని రిటైర్మెంట్ తీసుకోవడానికి బలవంతం చేశారని క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు.
అగార్కర్ అద్భుత రికార్డులు
అగార్కర్ కెరీర్లో కొన్ని అద్భుతమైన, కొన్ని అత్యంత అవమానకరమైన రికార్డులు ఉన్నాయి. 2002లో ఇంగ్లాండ్ పర్యటనలో చారిత్రక లార్డ్స్ మైదానంలో అగార్కర్ తన ఏకైక టెస్ట్ సెంచరీ (నాటౌట్ 109) నమోదు చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా ఏడు టెస్ట్ ఇన్నింగ్స్లలో డకౌట్ అయిన చెత్త రికార్డును.. అందులో నాలుగు వరుస 'గోల్డెన్ డక్లు' అయిన రికార్డును కూడా అగార్కర్ తన ఖాతాలో వేసుకున్నారు.

వన్డే క్రికెట్లో కేవలం 23 మ్యాచ్లలోనే 50 వికెట్లు తీసి, ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ (24 మ్యాచ్లు) రికార్డును అధిగమించి, ఆ సమయంలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా నిలిచారు. ఆ రికార్డును తరువాత 2008లో అజంతా మెండిస్ బ్రేక్ చేశాడు. అజిత్ అగార్కర్ జింబాబ్వేపై కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి, 25 బంతుల్లో 63 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 2003-04 ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్ట్లో 41 పరుగులకు 6 వికెట్లు తీసి, భారత్ చారిత్రక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
సచిన్ కోచ్ శిష్యుడు
అజిత్ అగార్కర్, భారత క్రికెట్కు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ వంటి స్టార్లను అందించిన అదే రమాకాంత్ ఆచ్రేకర్ క్రికెట్ స్కూల్కు విద్యార్థి. ఒకప్పుడు ముంబై స్కూల్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసి 'ఫ్యూచర్ సచిన్ టెండూల్కర్' అని పిలవబడిన అగార్కర్, ఆ తర్వాత బౌలింగ్పై దృష్టి సారించి భారత జట్టులోకి అరంగేట్రం చేశారు. అగార్కర్ నాయకత్వంలోనే ముంబై 2012-13 సీజన్లో రికార్డు స్థాయిలో 40వ సారి రంజీ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు.
రోహిత్-కోహ్లీతో ఉద్రిక్తత
అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్గా ఉన్న సమయంలోనే, జట్టులో మార్పులు తీసుకొచ్చే చర్చ మొదలైంది. ఈ ఒత్తిడి కారణంగానే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందుగా టీ20 క్రికెట్ నుంచి, ఆ తర్వాత ఈ సంవత్సరం ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్ను తప్పించి శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ ఇవ్వాలని అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రయత్నించడం వంటి పరిణామాల కారణంగానే డ్రెస్సింగ్ రూమ్లో 'కోల్డ్ వార్' వాతావరణం ఏర్పడిందని అభిమానులు భావిస్తున్నారు.