బీసీసీఐ భారీ ప్రకటన చేసింది. టీమిండియా చీఫ్ సెలెక్టర్గా మాజీ దిగ్గజం అజిత్ అగార్కర్ను నియమించింది. సీనియర్ పురుషుల సెలెక్షన్ కమిటీ చైర్మన్గా అగార్కర్ను నియమించినట్లు బీసీసీఐ వెల్లడించింది. భారత్ తరఫున ఎన్నో కీలకమైన ఇన్నింగ్సులు ఆడిన ఈ ఆల్రౌండర్ అయితేనే చీఫ్ సెలెక్టర్ బాధ్యతను నిర్వర్తించగలడని సీఏసీ భావించినట్లు తెలుస్తోంది.
సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఈ డెసిషన్ తీసుకుంది. చేతన్ శర్మ రాజీనామాతో సెలెక్షన్ కమిటీలో ఒక పోస్టు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ స్థానం కోసం దరఖాస్తులు చేసిన వారిని సీఏసీ ఇంటర్వ్యూలు చేసింది. వారిలో అజిత్ అగార్కర్కు ఈ పదవి దక్కింది. అనంతరం ముగ్గురు సభ్యుల ఈ కమిటీ ఏకగ్రీవంగా అగార్కర్ పేరును ప్రతిపాదించింది.

భారత్ తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, నాలుగు టీ20లు ఆడిన అగార్కర్.. అటు బంతితో, ఇటు బ్యాటుతో ఎన్నో కీలక ఇన్నింగ్సులు ఆడాడు. వీటికితోడు 110 ఫస్ట్ క్లాస్, 270 లిస్ట్-ఎ, 62 టీ20లు ఆడాడు. సౌతాఫ్రికాలో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో అగార్కర్ కూడా సభ్యుడు. అంతేకాదు, వన్డేల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన భారత ప్లేయర్ అగార్కరే. ఈ రికార్డును ఇప్పటికీ ఎవరూ బద్దలు చేయలేదు.
జింబాబ్వేతో 2000వ సంవత్సరంలో జరిగిన మ్యాచులో అతను కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అంతేకాదు, అత్యంత వేగంగా 50 వన్డే వికెట్లు తీసుకున్న బౌలర్గా కూడా అగార్కర్ రికార్డు సృష్టించాడు. కేవలం 23 మ్యాచుల్లోనే అతను 50 వికెట్లు తీసుకున్నాడు. ఈ రికార్డు దశాబ్ద కాలం పాటు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత ముంబై టీం చీఫ్ సెలెక్టర్గా అగార్కర్ సేవలందించాడు.
అనంతరం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం కోచింగ్ బృందంలో పని చేశాడు. సెలెక్టర్గా అగార్కర్ ఎంపికైన తర్వాత సీఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యధిక టెస్టులు ఆడిన అనుభవం ఉన్న కారణంగా అగార్కర్ను చీఫ్ సెలెక్టర్గా రికమెండ్ చేసింది. ప్రస్తుతం సెలెక్షన్ కమిటీలో అజిత్ అగార్కర్ (చీఫ్ సెలెక్టర్), శివ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ ఉన్నారు.