
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ గడ్డపై పేసర్ జేమ్స్ అండర్సన్ను ఎదుర్కోవడం అన్నిటికంటే కష్టమైన విషయం అని టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే పేర్కొన్నాడు. వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకుంటూ బంతులేయడంలో అండర్సన్ నేర్పరి అని రహనే అన్నాడు. రహానే వివిధ ఖండాల్లోని అనేక మంది బౌలర్లను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో ఆటగాళ్లు మానసికంగా ధృడంగా ఉండటం చాలా ముఖ్యమన్నాడు.
మంగళవారం ఇండియన్ ఆయిల్ నిర్వహించిన ఇన్స్టాచాట్ లైవ్ చాట్ సందర్భంగా అజింక్య రహానే పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఒక ప్రత్యేక బౌలర్ గురించి మాట్లాడండి అని అడగ్గా... 'ఇంగ్లండ్ గడ్డపై అండర్సన్ బౌలింగ్లో ఆడటం చాలా కష్టం. సొంత గడ్డపై ఎలాంటి బంతులేయాలో అతడికి బాగా తెలుసు. వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకుంటూ బంతులేయడంలో అండర్సన్ నేర్పరి' అని చెప్పాడు.
'కొవిడ్-19 కారణంగా లభించిన ఈ విరామంలో ఆటగాళ్లు మానసికంగా ధృడంగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ అథ్లెట్, క్రికెటర్ ఎవరైనా ఫిట్గా ఉండటం చాలా ముఖ్యం. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ ఇండ్లకే పరిమితమవడం మంచింది' అని రహానే అన్నాడు. 'కరోనా వ్యాప్తి చెందడం విచారకరమైన విషయం. అయితే నా కుమార్తె, కుటుంబ సభ్యులతో గడపడానికి నాకు సమయం దొరుకుతోంది. నా కుమార్తెకు ఆరున్నర నెలల వయస్సు, ఈ సమయంలో ఆమెతో ఉండటం నా అదృష్టం' అని పేర్కొన్నాడు.
బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ది వాల్ రాహుల్ ద్రవిడ్, టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన రోల్ మోడల్స్ అని అజింక్య రహానే చెప్పాడు. 2015 ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఫెదరర్ను కలవడం తనకు అభిమాన క్షణం అని వెల్లడించాడు. రహానే భారత్ తరఫున 65 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. మొత్తంగా 14 సెంచరీలు, 47 అర్ధ సెంచరీలు చేసాడు. ఇక 140 ఐపీఎల్ మ్యాచ్లలో రెండు సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు చేసాడు.
దేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం అజింక్య రహానే ముందుకొచ్చిన విషయం తెలిసిందే. తన వంతు సాయంగా రూ. 10 లక్షల రూపాయాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించాడు. ఈ విషయాన్ని రహానే సన్నిహితుడొకరు పీటీఐ వార్త సంస్థకు తెలియజేశారు. అయితే రహానే మాత్రం ఇప్పటి వరకు తాను చేసిన సాయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.