
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఊహించని దెబ్బ తగిలింది. బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్వతహాగా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
దీంతో ఈ సీజన్కు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా అజ్యింకె రహానేను నియమిస్తున్నట్లు ఫ్రాంఛైజీ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో అధికారిక ప్రకటన చేసింది. 'ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు రహానె కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. కేప్టౌన్లో చోటు చేసుకున్న ఘటన యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది' అని రాజస్థాన్ యాజమాన్యం తెలిపింది.

'ఇటు బీసీసీఐ.. అటు స్మిత్తో ఎప్పటికప్పుడు చర్చలు జరిపాం. ఈ క్రమంలోనే అతడు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెప్పాడు. స్మిత్ నిర్ణయానికి అంగీకరించాం. ఆ స్థానంలో రహానేను ఎంపిక చేశాం. రాయల్స్ కుటుంబంలో రహానే ఎప్పటి నుంచో సభ్యుడు. రహానే సమర్థవంతగా జట్టును నడిపిస్తాడన్న నమ్మకం మాకు ఉంది' అని పేర్కొంది.
స్టీవ్ స్మిత్ పై ఐసీసీ తీసుకునే చర్యల ఆధారంగా ఐపీఎల్లో అతడిని ఆడనివ్వాలా వద్దా? అన్నదానిపై రాజస్థాన్ ఫ్రాంచైజీ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. బాల్ టాంపరింగ్కు పాల్పడటంతో పాటు తాము చేసింది చిన్న తప్పు అన్నతీరుగా వ్యవహరించి స్మిత్ క్రీడాస్ఫూర్తిని దెబ్బతీశాడని అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా బాల్ టాంపరింగ్కు ఆటగాళ్లను ప్రోత్సహించిన స్టీవ్ స్మిత్పై జీవితకాల నిషేధం విధించనున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే స్మిత్పై ఓ టెస్ట్ మ్యాచ్ నిషేధంతో పాటు, మ్యాచ్ ఫీజు 100 శాతం కోత వేసినట్లు ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.