హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ అజ్యింకె రహానే ఓ సైనికుడులాంటి వాడని, ఎప్పుడైనా జట్టులోకి వచ్చి తన సేవలను దేశానికి అందించడానికి సిద్ధంగా ఉంటాడని అతని కోచ్ ప్రవీణ్ ఆమ్రే వెల్లడించారు. ఆసీస్తో మూడు టీ20ల సిరీస్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో రహానేకు చోటు దక్కని సంగతి తెలిసిందే.
ఆసీస్తో ముగిసిన వన్డే సిరీస్లో రహానే వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు సాధించినా అతనికి టీ20 జట్టులో చోటు దక్కకపోవడంపై చాలా మంది మాజీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 'ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లో మెరుగ్గా రాణించిన రహానేను కాదని ఆ సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని రాహుల్కి సెలక్టర్లు ఎందుకు అవకాశమిచ్చారో నాకు అర్థం కావడం లేదు' అని గవాస్కర్ ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో రహానే వ్యక్తిగత కోచ్ ప్రవీణ్ ఆమ్రే మీడియాతో మాట్లాడారు. 'రహానే ఓ సైనికుడులాంటి వాడు. ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా దేశానికి సేవ చేసేందుకు ఎదురుచూస్తూ ఉంటాడు. అతను చాలా పరిణతితో ఆలోచిస్తాడు. టీ20 జట్టు నుంచి తనని తప్పించినప్పుడు అతను స్పందించిన విధానమే దానికి నిదర్శనం' అని పేర్కొన్నాడు.
జట్టులో స్థానంపై అతడికి ఎలాంటి అభద్రతా భావం లేదు. ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లో రహానె వరుసగా 5, 55, 70, 53, 61 స్కోర్లతో రాణించాడు. సహజంగా ఇంత మంచి ప్రదర్శన చేసిన తర్వాత తప్పిస్తే.. ఆ స్థాయి క్రికెటర్ ఎవరైనా సెలక్టర్ల నిర్ణయం తప్పు లేదా ఒప్పు అని చెప్పేవాడు. కానీ, రహానె మాత్రం ప్రస్తుతం న్యూజిలాండ్తో జరిగే సిరీస్ కోసం సాధనలో మునిగిపోయాడు' అని ప్రవీణ్ తెలిపాడు.