డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డును న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ గెలుచుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ తాజాగా వెల్లడించింది. డిసెంబర్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్కు ఐసీసీ ముగ్గురు ఆటగాళ్లను నామినేట్ చేసింది. ఇందులో అజాజ్ పటేల్తోపాటు టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్, ఆస్ట్రేలియా సీనియర్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఉన్నారు. అయితే ఓటింగ్లో అజాజ్ పటేల్కే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఐసీసీ తెలిపింది. దీంతో అజాజ్ పటేల్ను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్కు ఎంపిక చేసింది.
2021 డిసెంబర్లో భారత పర్యటనలో భాగంగా ముంబై వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీయడం ద్వారా అజాజ్ పటేల్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ఆ మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో ఒక్కడే టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్గా అజాజ్ పటేల్ రికార్డు సృష్టించాడు. ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టడం తన జీవితంలో గొప్ప విషయమని ఆ మ్యాచ్ అనంతరం అజాజ్ పటేల్ చెప్పాడు. ఇది ఎప్పటికీ తనకు గుర్తుండిపోతుందని చెప్పుకొచ్చాడు. కాగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్న సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డుమినీ 10 వికెట్లు పడగొట్టడం ద్వారా అజాజ్ పటేల్ చారిత్రాత్మక ఘనతను సొంతం చేసుకున్నాడని తెలిపాడు. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సి సమయం అన్నాడు. అంతేకాకుండా రాబోయే రోజుల్లోనూ ఈ రికార్డు గుర్తుండి పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదని డుమిని అభిప్రాయపడ్డాడు.
ఇక తన కెరీర్లో 11 టెస్టు మ్యాచ్లాడిన అజాజ్ పటేల్ 20 ఇన్నింగ్స్ల్లో 43 వికెట్లు పడగొట్టాడు. అలాగే 7 టీ20ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. కాగా ముంబై వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో టీమిండియా 372 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 325 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 62 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 276 పరుగుల వద్ద డిక్లేర్ చేసి కివీస్ ముందు 540 పరుగుల ఉంచింది. కానీ ఆ లక్ష్యాన్ని చేధించలేక న్యూజిలాండ్ 167 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో టీమిండియా సిరీస్ను 1-0తో గెలుచుకుంది. కాగా అంతకు ముందు జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.