
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు బలంగా పుంజుకుంది. జట్టు మొదటి T20Iలో పరాజయం పాలయినప్పటికీ.. తరువాతి రెండు మ్యాచ్లలో బలమైన పునరాగమనం చేసి మూడు మ్యాచ్ల సిరీస్ 2-1తో గెలుపొందింది. ఈ సిరీస్లో లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ మూడు మ్యాచ్లలో ఎనిమిది వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు.
అతను సిరీస్లో అత్యధిక వికెట్లు పడగొట్టడమే కాకుండా అత్యంత పొదుపుగా (6.30 RPO) కూడా బౌలింగ్ చేశాడు. ఇక ఈ సిరీస్ అనంతరం భారత మాజీ కెప్టెన్ అజయ్ జడేజా పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ జట్టుకు సరైన ఎక్స్ ఫ్యాక్టర్గా మారాడని కొనియాడాడు.
'అక్షర్ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అతను రెండు చేతులతో అందివచ్చిన అవకాశాన్ని అందుకున్నాడు. మనమందరం రవీంద్ర జడేజాను కోల్పోయాము అని భావించాం. జడేజా లాంటి ప్లేయర్ జట్టుకు ఎంత కీలకమో మనకు తెలుసు. ఎవరూ జడేజా లాంటి ప్లేయర్ను కోల్పోవాలనుకోరు. అతను తన బౌలింగ్తో అలాగే బ్యాటింగ్తో చాలా ఉపయుక్తమవుతాడు. ముఖ్యంగా అతని ఫీల్డింగ్ జట్టుకు ఎంత అడ్వాంటేజో మనందరికీ తెలిసిందే. అక్షర్ జట్టులోకి రావడంతో జడేజా లేని లోటు పెద్దగా కన్పించలేదు.

అతను సైతం లెఫ్టార్మ్ స్పిన్ ఆల్రౌండర్ కావడం, పొదుపుగా బౌలింగ్ చేయగలగడం, అలాగే మంచి ఫీల్డింగ్ కనబర్చడం అన్నీ కూడా జడేజా లేడనే ఫీలింగ్ తేనివ్వలేదు. అక్షర్ పటేల్ ప్రపంచకప్ జట్టులోను ఉన్నాడు. కాబట్టి అతను తప్పకుండా టీమిండియా తరఫున ప్రపంచకప్ ఆడతాడు. అయితే అక్షర్ పటేల్ జట్టులో సెట్టయ్యాక మళ్లీ రవీంద్రా జడేజా జట్టులోకి రావడం చాలా కష్టమవుతుంది. అప్పుడు ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది.' అని అజయ్ జడేజా అన్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.