రాంచీ వేదికగా భారత్తో జరిగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ.. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ తన జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిని వ్యక్తం చేశాడు. లక్ష్యఛేదనలో అద్భుతమైన పోరాట పటిమ కనబరిచిన జట్టును చూసి గర్వంగా ఉందన్నాడు.
మార్క్రమ్ మాట్లాడుతూ.."నిజంగా గర్వంగా ఉంది. డ్రెస్సింగ్ రూమ్లో కూర్చుని ఆటగాళ్లు తమ వంతు కృషి చేయడం చూడటం గొప్పగా అనిపించింది. చివరి వరకు అద్భుతం చేసి, గెలుపును మా వైపు తిప్పుకోగలమనే నమ్మకాన్ని మేము ఎప్పుడూ కోల్పోలేదు." అని మార్క్రమ్ అన్నాడు. ఓటమికి ప్రధాన కారణాన్ని వివరిస్తూ.. ముఖ్యంగా టాప్ ఆర్డర్ వైఫల్యమే కొంప ముంచిందని పేర్కొన్నాడు.

"ఛేదించే సమయంలో కొత్త బంతితో కొంత పదును ఉంటుందని మాకు తెలుసు. అయినప్పటికీ ఛేజింగ్ చేయడం సరైన మార్గమని భావించాం. ఆరంభంలో ఆ కష్టాన్ని దాటడానికి ప్రయత్నించాం. "ఒకసారి ఆ కష్టాన్ని అధిగమించిన తర్వాత, మా మిడిల్ ఆర్డర్ (మధ్య స్థాయి బ్యాటర్లు) ఎంత అద్భుతంగా ఆడగలరో మేము చూశాం. ఒకటి, రెండు కీలక సమయాల్లో తేడాలు వచ్చాయి." అని సౌతాఫ్రికా కెప్టెన్ వెల్లడించాడు.
పోరాట పటిమపై ప్రశంసలు
మొత్తంమీద జట్టు పోరాట పటిమపై మార్క్రమ్ ప్రశంసలు కురిపించాడు."మొత్తంమీద ఈ ప్రయత్నం పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. మేము గెలుపునకు చాలా దగ్గరగా వచ్చాం, ఇది మాలోని అద్భుతమైన పట్టుదలను (Character) చూపించింది. ఏ జట్టు అయినా బ్యాటింగ్ వీలైనంత లోతుగా ఉండాలని కోరుకుంటుంది. జాన్సెన్, బాష్ వంటి ఆటగాళ్లు మా కోసం అదే చేస్తున్నారు." అని మార్క్రమ్ ప్రశంసించాడు.
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా రాంచీలో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుపై ఉత్కంఠభరితంగా పోరాడి విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా ఈ సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. మ్యాచ్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి విరాట్ కోహ్లీ సెంచరీ దెబ్బకు 349 పరుగుల భారీ స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 332 పరుగులకే పరిమితమైంది. ఈ క్రమంలో భారత్ 17 రన్స్ తేడాతో విజయం సాధించింది.