సౌతాఫ్రికా టీ20 లీగ్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. టేబుల్ టాపర్ ఎంఐ కేప్టౌన్కు షాకిచ్చింది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో కేప్టౌన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే సన్రైజర్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో ఆ జట్టును సఫారీ స్టార్ రాసీ వాన్ డర్ డస్సెన్ (29) ఆదుకున్నాడు.
వాన్ డర్ డస్సెన్ కూడా ఇన్నింగ్స్ ఆసాంతం నిలవలేకపోయాడు. 22 బంతుల్లో 29 పరుగులు చేసిన తర్వాత అతను కూడా పెవిలియన్ చేరాడు. అయితే మరో ఎండ్లో పాతుకుపోయిన జార్జ్ లిండే అద్భుతంగా పోరాడాడు. కేవలం 28 బంతుల్లోనే 63 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉండటం గమనార్హం. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే జార్జ్ లిండే పోరాటంతో కేప్టౌన్ జట్టు 158 పరుగుల స్కోరు సాధించింది. సన్రైజర్స్ సారధి ఎయిడెన్ మార్క్రమ్, సిసాండ మగలా చాలా పొదుపుగా బౌలింగ్ వేయడంతోపాటు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ కూడా కొంత తడబడింది. అయితే కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అతనికి సారెల్ ఎర్వీ, ట్రిస్టియన్ స్టబ్స్ కూడా ఫర్వాలేదనిపించారు. దీంతో సునాయాసంగా గెలిచేలా కనిపించిన సన్రైజర్స్ వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివర్లో కేప్టౌన్ బౌలర్ ఒడియన్ స్మిత్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మార్క్రమ్ సహా కీలక వికెట్లు కూల్చాడు. అయితే జేమ్స్ ఫుల్లర్ రెండు బౌండరీలు బాది జట్టుకు విజయాన్నందించాడు. దీంతో సన్రైజర్స్ మరో మూడు బంతులు మిగిలుండగానే కేప్టౌన్పై విజయం సాధించింది. అటు బంతితో, ఇటు బ్యాటుతో అద్భుతంగా రాణించిన ఎయిడెన్ మార్క్రమ్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.