
డబ్లిన్: ఐర్లాండ్తో సోమవారం జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా సునాయాస విజయం సాధించింది. బ్యాట్స్మన్ ఐడెన్ మార్క్రమ్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తబ్రెయిజ్ షంషీ చెలరేగడంతో 33 పరుగులతో ప్రొటీస్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 165 పరుగులు చేయగా.. ఛేదనలో ఐర్లాండ్ 132 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో ప్రొటీస్ మూడు మ్యాచుల టీ20 సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గురువారం ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. అంతకుముందు జరిగిన మూడు మ్యాచుల వన్డే సిరీస్ 1-1తో సమయం అయింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 165 పరుగులు చేసింది. ఓపెనర్లు బావుమా (13), డికాక్ (20) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. జన్నెమాన్ మలన్ (1) కూడా పూర్తిగా నిరాశపరిచాడు. ఈ సమయంలో రాస్సీ వాన్ డెర్ డుసెన్ (25, 18 బంతుల్లో 2x4, 1x6), ఐడెన్ మార్క్రమ్ (39, 30 బంతుల్లో 2x4, 2x6) ఆదుకున్నారు. ఆపై డేవిడ్ మిల్లర్ (28, 21 బంతుల్లో 3x4) కూడా పర్వాలేదనిపించాడు. ఇన్నింగ్స్ చివరలో పేసర్ కాగిసో రబడా (19, 9 బంతుల్లో 4x4) నాలుగు ఫోర్లతో అలరించాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ (3/39) మూడు వికెట్లు తీయగా.. సిమిసింగ్ (2/19), జోష్ లిటిల్ (2/27) చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన ఐర్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (6), కెవిన్ ఓ బ్రైన్ (0) విఫలమయ్యారు. జార్జ్ డోక్రెల్ (2) కూడా తక్కువ పరుగులకే ఔట్ అయ్యాడు.
ఈ సమయంలో కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ (22), హరీ ట్రెక్టర్ (36) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ పెవిలియన్ చేరిన అనంతరం సిమి సింగ్ (4), లోర్కాన్ టక్కర్ (5), షేన్ గెట్కేట్ (2), మార్క్ అడైర్ (0) లు విఫలమవడంతో ఐర్లాండ్ భారీ ఓటమి ఎదుర్కొంటుందని అనుకున్నారు. మెకార్తీ (30 నాటౌట్), లిటిల్ (15 నాటౌట్) చివరి వికెట్కు అభేద్యంగా 44 పరుగులు జోడించి పరుగుల అంతరాన్ని తగ్గించారు.