ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ - 2025కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక మెగా లీగ్ మొదలైంది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికగా ఉన్న మైదానాల్లో ఒకటైన కరాచీ స్టేడియంలోకి ఓ వ్యక్తి మీడియా ప్రతినిధి అంటూ ఫేక్ అక్రిడిటేషన్ కార్డుతో చొరబడే యత్నం చేశాడు. ఈ సంఘటన అక్కడి భద్రతపై సందేహాల్ని లేవనెత్తింది.
అసలేం జరిగిందంటే?
ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ కోసం తమ స్టేడియాల్లో రెనోవేషన్ పనులను చేయించింది పీసీబీ బోర్డు. ఇందులో భాగంగా రెనోవేషన్ పనులు చేయించిన కరాచీ స్టేడియంలో ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందు ట్రై సిరీస్ ఆడుతోంది పాక్. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. ఈ క్రమంలోనే అక్కడ జరిగే ట్రై సిరీస్ లోని ఓ మ్యాచ్ కు ఓ అపరచిత వ్యక్తి హాజరవ్వబోయాడు. మీడియా ప్రతినిధిగా గుర్తింపు కార్డు, ఐసీసీ అక్రిడిటేషన్ కార్డులతో కరాచీ స్టేడియంలోకి ఎంట్రీ ఇవ్వబోయాడు. కానీ స్టేడియం మెయిన్ గేట్ దగ్గరే అతడి చర్యలతో అనుమానం వచ్చిన పోలీసులు అడ్డుకున్నారు.

అతడు పాకిస్థాన్ కు చెందిన స్థానికి వ్యక్తి ముజమ్మిల్ ఖురేషీగా గుర్తించారు. వెంటనే అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ వ్యక్తి దగ్గర ఉన్న కెమెరామెన్, ఐసీసీ అక్రిడిటేషన్ కార్డ్ సహా ఇతర కార్డులన్నీ నకిలీవని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం బయటకు రావడంతో క్రికెట్ అభిమానులకు అక్కడి భద్రతపై అనుమానాలు నెలకొన్నాయి.