కుంబ్లేపై గుర్రుగా
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కుంబ్లే టీమిండియాను గైడ్ చేసే పద్ధతిపై కెప్టెన్ కోహ్లీతోపాటు కొందరు సీనియర్లు గుర్రుగా ఉన్నారు. దీంతో ఆటగాళ్లను శాంతింపజేసేందుకు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్లు రంగంలోకి దిగినట్లు తెలిసింది.
కోహ్లీ అసంతృప్తి
న్యూజిలాండ్తో ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం ఈ సమస్యపై గంగూలీతో కోహ్లీ మాట్లాడినట్లు సమాచారం. వాస్తవానికి కుంబ్లేను కోచ్గా కొనసాగించాలని బీసీసీఐ భావించినా.. కోహ్లీ అందుకు నిరాకరించినట్లు సమాచారం. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం కుంబ్లే కాంట్రాక్ట్ పూర్తవనుంది. కొత్త టీమిండియా కోచ్కు ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది.
నో చెప్పిన సెహ్వాగ్
అయితే, కొత్త కోచ్ ఎంపిక జరిగే వరకూ కుంబ్లేను బీసీసీఐ కోచ్గా కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. సీఓఏ ప్రత్యక్షంగా టీంను పర్యవేక్షించలేదు కాబట్టి, కొత్త కోచ్ ను ముగ్గురు సభ్యుల కమిటీనే ఎన్నుకుంటుందని సమాచారం. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను కోరగా.. అతడు అందుకు నిరాకరించినట్లు తెలిసింది.
ద్రావిడ్ ఆసక్తి
కాగా, రవిశాస్త్రి కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తికనబర్చలేదు. అయితే, ఆస్ట్రేలియా ఆటగాడు టామ్ మూడీ కోచ్ పదవికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. కాగా, రాహుల్ ద్రావిడ్ కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ముందే ఇలా..
ఇది ఇలా ఉంటే.. కుంబ్లే వర్కింగ్ స్టైల్ కంటే రవిశాస్త్రి పనితీరునే ఆటగాళ్లు ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు సమాచారం. కోచ్పై ఆటగాళ్ల అసంతృప్తి గురించి సీఓఏ వినోద్ రాయ్ ముగ్గురు సభ్యుల కమిటీతో చర్చించనున్నట్లు తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియాలో ముసలం చోటు చేసుకోవడం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతాయా? అనే ఆందోళన నెలకొంది.