సిడ్నీ: తన దూకుడుకు గురించిన కీలక విషయాన్ని భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బహిర్గత పర్చాడు. అదేంటంటే.. దూకుడుగా ఉండటం అన్నది తన రక్తంలోనే ఉందని పేర్కొన్నాడు ఈ స్టార్ బ్యాట్స్మన్. తన కుటుంబం నుంచే ఈ దూకుడును నేర్చుకున్నట్లు తెలిపాడు.
'మా నాన్నది సింహరాశి. అన్నిటికీ పోట్లాడేవాడు. తన మీద తనకు నమ్మకం ఎక్కువ. అలా మా కుటుంబం నుంచి నాకు కొంచెం దూకుడు అలవడిందనుకుంటా. పైగా నేను పెరిగింది ఢిల్లీలో. ఈ వ్యవస్థలో నెగ్గుకు రావాలంటే పోరాడాల్సిందే. అలా పోరాడినపుడు మనం మానసికంగా బలవంతులమవుతాం' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

అంతేగాక, 'మన చుట్టూ ఏం జరుగుతుందో అని ఎక్కువ ఆలోచించకుండా మన పని మీద మనం దృష్టిపెట్టాలి. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినపుడు కేవలం 11 మందిలో ఒకడిగా ఉండాలనుకోలేదు. ప్రత్యర్థి జట్టంతా ముందు నా వికెట్టే తీయాలని కోరుకోవాలనుకున్నా' అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
అంతర్జాతీయ క్రికెట్లో మెరుగుపడటానికి తనకు సచిన్ స్ఫూర్తినిచ్చాడని.. అతను భారత జట్టు తరఫున చేసిందంతా తానూ చేయాలనుకున్నానని కోహ్లి తెలిపాడు.
'నా బ్యాటింగ్లో లోపాలుంటే సచిన్ నేరుగా వచ్చి వాటిని సరిదిద్దుకోమని చెప్పేవాడు. అతని స్థాయి ఆటగాడు ఇలా ఒక జూనియర్ దగ్గరకు పదే పదే వచ్చి చెప్పడం చాలా అరుదు. ఆ ప్రోత్సాహమే నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది' అని కోహ్లి వివరించాడు.