91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల సిరీస్లో టీమిండియా తొలిసారి వైట్వాష్కు గురికావడంపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, కోచ్ గౌతమ్ గంభీర్లను మాజీ క్రికెటర్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ఘోర పరాజయానికి వాళ్లు బాధ్యత వహించాలని పేర్కొంటున్నారు. న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి టెస్టులో 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 121 పరుగులకే కుప్పకూలిన భారత్ సిరీస్ను 0-3తో కోల్పోయిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దారుణంగా విఫలమయ్యారు. కోహ్లి 15.50 సగటుతో కేవలం 93 పరుగులే చేశాడు. ఇక రోహిత్ 15.16 సగటుతో 91 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు క్రికెటర్ల రిటైర్మెంట్ గురించి జోరుగా చర్చసాగుతోంది. 36 ఏళ్ల కోహ్లి, 37 ఏళ్ల రోహిత్ ఆటకు వీడ్కోలు పలుకుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో రోహిత్ శర్మ గురించి భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సిరీస్లో రోహిత్ శర్మ విఫలమైతే, ఆ సిరీస్లో చివరి మ్యాచే రోహిత్కు ఆఖరి టెస్టు అవుతుందని క్రిష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం రోహిత్ సుదీర్ఘ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అన్నాడు. రోహితే స్వయంగా టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటాడని పేర్కొన్నాడు. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన హిట్ మ్యాన్ ఇకపై వన్డేల్లోనే కొనసాగే అవకాశం ఉందని తెలిపాడు.

రోహిత్కు వయసు అయిపోతుందని విషయాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలని క్రిష్ణమాచారి శ్రీకాంత్ అన్నాడు. అయితే కివీస్ సిరీస్లో బ్యాటర్-కెప్టెన్గా విఫలమయ్యానని రోహిత్ అంగీకరించిన తీరును ఆయన మెచ్చుకున్నాడు. కాగా, రోహిత్కు ప్రత్యామ్నాయంగా ఓపెనర్ను సిద్ధం చేయాలని బీసీసీఐకి సూచనలు చేశాడు.
ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్
డిసెంబర్ 06-10: రెండో టెస్టు- అడిలైడ్
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్బోర్న్
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ .