
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇకపై చిన్నారులకు క్రికెట్ పాఠాలు బోధించనున్నాడు. ఇంగ్లాండ్ కౌంటీ క్లబ్ మిడిలెక్స్తో కలిసి చిన్నారులను అద్భుతమైన క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు త్వరలో అకాడమీని ప్రారంభించనున్నట్లు సచిన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా సోమవారం నార్త్వుడ్లోని మర్చంట్ టైలర్స్వుడ్ పాఠశాలలోటెండూల్కర్ మిడిలెక్స్ గ్లోబల్అకాడమీ(టీఎంజీఏ)పేరుతో కొత్త అకాడమీని సచిన్ ప్రారంభించాడు. ఈ అకాడమీ పేరు టెండూల్కర్ మిడిలెక్స్ గ్లోబల్ అకాడమీ(టీఎమ్జీఏ). ఆగస్టు9 నుంచి 14 ఏళ్ల బాలబాలికలకు సచిన్ క్రికెట్ పాఠాలు చెప్పనున్నాడు.
ఈ అకాడమీ గురించి సచిన్ గతంలో తన ట్విటర్ ద్వారా వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ముంబై, లండన్లో కూడా ఈ అకాడమీలు ప్రారంభించనున్నారు. దీంతో పాటు దేశ వ్యాప్తంగా పలు క్యాంపులు కూడా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సచినే స్వయంగా క్లాసులు చెప్పనున్నాడు.
అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా మర్చంట్ టైలర్స్వుడ్ పాఠశాల విద్యార్థులతో సచిన్ స్వయంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా విద్యార్ధులడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ "మిడిలెక్స్ భాగస్వామ్యంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడం నాకు ఆనందం కలిగిస్తోంది" అని పేర్కొన్నాడు.
"ఈ అకాడమీ ద్వారా మంచి క్రికెటర్లను అందించడమే కాదు.. భవిష్యత్లో మంచి పౌరులుగా ప్రపంచానికి ఉపయోగపడే వ్యక్తులను తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతాం. అకాడమీలోని విద్యార్థులకు మంచి క్రికెట్ పాఠాలను అందించడమే లక్ష్యంగా మిడిలెక్స్తో కలిసి ముందుకు సాగుతాను" అని సచిన్ తెలిపాడు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను మిడిలెక్స్ మేనేజ్మెంట్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.