హైదరాబాద్: ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ప్రధాన స్పిన్నర్ ఆస్టన్ అగర్ భారత్తో జరిగే మిగతా రెండు వన్డేలకు దూరమయ్యాడు. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అగర్ చిటికిన వేలికు గాయమైంది.
మ్యాచ్ అనంతరం అగర్కు స్థానిక ఆసుపత్రిలో ఎక్స్రే తీయగా గాయం తీవ్రత ఎంటో తెలిసింది. దీంతో అతడికి విశ్రాంతి తప్పని సరి అని ఆసీస్ టీమ్ డాక్టర్ రిచర్డ్ షా తెలిపారు. దీంతో అగర్ స్వదేశానికి తిరుగు పయనం కానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది.

అక్కడ మరోసారి వైద్యులను సంప్రదించి అవసరమైతే శస్త్రచికిత్స చేయిస్తామని జట్టు ఫిజియో తెలిపారు. ఐదు వన్డేల సిరిస్లో మిగతా రెండు వన్డేలకు అగర్ స్థానంలో ఎవరిని తీసుకోవడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. కాగా, ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే గురువారం బెంగళూరులో జరగనుంది.