
హైదరాబాద్: భారత్లో శ్రీలంక పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరిలో శ్రీలంక జట్టు మూడు టీ20ల సిరిస్ కోసం భారత్లో పర్యటించనుంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ), శ్రీలంక క్రికెట్ బోర్డు షెడ్యూల్ని ప్రకటించాయి. ఐసీసీ జింబాబ్వే జట్టుపై నిషేధం విధించిన నేపథ్యంలో బీసీసీఐ శ్రీలంక జట్టుని ఆహ్వానించింది.
శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం భారత్లో పర్యటించేందుకు అంగీకరించింది. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు జనవరి, 2020లో మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఈ మూడు టీ20లు జనవరి 5, 7, 10న నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
భారత్లో శ్రీలంక జట్టు పర్యటన:
05 January - 1st T20I, Guwahati
07 January - 2nd T20I, Indore
10 January - 3rd T20I, Pune
ఇదిలా ఉంటే, శ్రీలంక జట్టు ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉంది. పాక్ పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. మూడు వన్డేల సిరిస్లో భాగంగా కరాచీ వేదికగా సెప్టెంబర్ 27న శ్రీలంకతో పాకిస్థాన్ జట్టు తొలి వన్డేతో తలపడనుంది. జనవరి 2009 తర్వాత కరాచీ వేదికగా జరుగుతున్న మొట్టమొదటి వన్డే ఇదే కావడం విశేషం.
పదేళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డపై ద్వైపాక్షిక సిరిస్ జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు స్టేడియాలకు రావాలని పిలుపునిచ్చాడు. పాకిస్థాన్తో మూడు వన్డేలు, మూడు టీ20 ఆడేందుకు శ్రీలంక జట్టు మంగళవారం ఉదయం కొలంబో నుంచి పాకిస్థాన్కు బయలుదేరింది. అయితే వెళ్లే ముందు లంక ఆటగాళ్లు పూర్తి జాగ్రత్తలు తీసుకుని మరీ బయల్దేరిన సంగతి తెలిసిందే.
భద్రతాపరమైన అనుమానాలతో కెప్టెన్లు లసిత్ మలింగా, దిముత్ కరుణరత్నే సహా పలువురు సీనియర్ ఆటగాళ్లు పాక్ పర్యటనకు దూరంగా ఉన్నారు. సీనియర్ ఆటగాళ్లు వెళ్లబోమని తెగేసి చెప్పడంతో.. శ్రీలంక బోర్డు యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చి వారిని అక్కడికి పంపించింది. పాక్ పర్యటనకు బయల్దేరడానికి ముందు శ్రీలంక జట్టులోని ఆటగాళ్లు అందరూ బౌద్ధ గురువుతో తాయెత్తులు కట్టించుకున్నారు.
తాయెత్తులకు సంబందించిన పోటోలను లంక బోర్డు ట్విటర్లో పోస్టు చేసింది. 2009లో పాక్ పర్యటన సందర్భంగా.. శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో ఆరుగురు లంక ఆటగాళ్లు గాయపడగా.. ఆరుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఉగ్రదాడి తర్వాత ఆ దేశంలో పర్యటించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావడం లేదు. ఎట్టకేకలకు లంక సాహసం చేస్తోంది.