బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ సెంచరీ సాధించాడు. యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్కు విశ్రాంతి ఇవ్వడంతో ఓపెనర్గా బరిలోకి దిగిన శాంసన్ అదరగొట్టాడు. అయితే వైట్ బాల్ క్రికెట్ వరకే తాను పరిమితం కానని, టెస్టు క్రికెట్లోనూ భారత్ తరఫున సత్తాచాటాలని భావిస్తున్నట్లు సంజు శాంసన్ తెలిపాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ తనని భారత టెస్టు జట్టులోకి పరిగణిస్తున్నారని శాంసన్ చెప్పాడు.ఈ విషయాన్ని దులీప్ ట్రోఫీకి ముందే తనకి తెలియజేశారని, రంజీ ట్రోఫీ మ్యాచ్లను ఎక్కువగా ఆడమని సూచించారని తెలిపాడు. టీ20 వరల్డ్ కప్కు ఎంపికైన సంజు శాంసన్ ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం రాలేదు. అనంతరం జింబాబ్వే సిరీస్ ఆడిన శాంసన్ అర్ధశతకంతో మెరిశాడు.

అయితే ఆ తర్వాత శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్లో రెండు మ్యాచ్ల్లో తుదిజట్టులో శాంసన్ అవకాశం దక్కించకున్నాడు. కానీ రెండు మ్యాచ్ల్లోనూ డకౌటయ్యాడు. అనంతరం దులీప్ ట్రోఫీకి ఎంపికైన శాంసన్ సెంచరీతో మెరిశాడు. అదే జోరును బంగ్లాదేశ్ టీ20 సిరీస్లోనూ ప్రదర్శించాడు. '' నాకు రెడ్ బాల్ క్రికెట్లో సత్తాచాటే నైపుణ్యం ఉంది. భారత్ తరఫున టెస్టుల ఆడటం నా కోరిక. టెస్టు క్రికెట్కు నన్ను పరిగణిస్తున్నట్లు టీమిండియా మేనేజ్మెంట్ దులీప్ ట్రోఫీకి ముందే తెలియజేసింది. రంజీ ట్రోఫీ మ్యాచ్లను సీరియస్గా ఆడమని సూచించింది''
''ప్రస్తుతం నా సన్నద్ధత బాగుంది. శ్రీలంక సిరీస్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ అకాడమీలో రాహుల్ ద్రవిడ్ సర్, జుబిన్ భారుచా సర్లతో నా ఆటపై శ్రమించాను. దులీప్ ట్రోఫీలో సాధించిన సెంచరీతో నాలో అత్మవిశ్వాసం మరింత పెరిగింది'' అని సంజు శాంసన్ పేర్కొన్నాడు. కాగా, 29 ఏళ్ల సంజు శాంసన్ రంజీ ట్రోఫీలో కేరళ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. శుక్రవారం నుంచి కర్ణాటకతో ప్రారంభం కానున్న రెండో మ్యాచ్కు శాంసన్ అందుబాటులోకి వచ్చాడు.