
హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. గాలి కాలుష్యం కారణంగా మంగళవారం ఉదయం శ్రీలంక పేసర్ సురంగ లక్ష్మల్ మైదానంలోనే వాంతి చేసుకోగా... ఆ తర్వాత భారత బౌలర్ షమీ మైదానంలో వాంతి చేసుకున్నాడు.
ఓవర్నైట్ స్కోరు 356/9 ఓవర్నైట్ స్కోర్తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన పర్యాటక జట్టు మరో 17 పరుగులు జోడించి చివరి వికెట్ కోల్పోయింది. నాలుగో రోజు ఆట ప్రారంభమయ్యాక 5 ఓవర్ల వ్యవధిలోనే ఆఖరి వికెట్ను కోల్పోయింది. దీంతో 135.3 ఓవర్ల పాటు ఆడిన శ్రీలంక 373 పరుగులు చేసి ఆలౌటైంది.
అనంతరం టీమిండియా రెండో ఇన్నింగ్స్ని ప్రారంభించింది. మంగళవారం ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సురంగ లక్మల్ వాంతులు చేసుకున్నాడు. దీంతో అతడి బదులు షనక మాస్క్తో వచ్చి ఫీల్డింగ్ చేశాడు. అనంతరం లక్మల్ ఇబ్బందులు గమనించిన మిగతా లంక ఆటగాళ్లు కూడా ముఖానికి మాస్కులు తగిలించుకొని ఫీల్డింగ్ చేశారు.
గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గి కాలుష్యం స్థాయిలు పెరగడంతో లంక బౌలర్ సురంగ లక్మల్ మరోసారి వాంతులు చేసుకున్నట్లు వెల్లడైంది. గత నాలుగు రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 246/5 వద్ద కోహ్లీ సేన రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో లంక బ్యాటింగ్కు దిగింది.

ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేయమని కోహ్లీ... షమి బంతికి ఇచ్చాడు. 5.5 వద్ద షమి వేసిన బంతిని ఎదుర్కొన్న సమరవిక్రమ(5) రహానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అనంతరం షమి బౌలింగ్ వేసేందుకు వచ్చే క్రమంలో ఛాతిని పట్టుకొని కాస్త ఇబ్బందిగా కనిపించాడు. అనంతరం మైదానంలోనే వాంతి చేసుకున్నాడు.
కాస్త తేరుకున్న తర్వాత ఆ ఓవర్లో మిగిలి ఉన్న ఒక్క బంతిని వేశాడు. 7వ ఓవర్ అనంతరం షమీ అంపైర్కు తన పరిస్థితిని వెల్లడించి మైదానాన్ని వీడాడు. నిజానికి రెండోరోజే శ్రీలంక ఆటగాళ్లు మాస్కులతో ఆడటం, పదేపదే మ్యాచ్కు అంతరాయం కలిగించడం చూసి భారత ఆటగాళ్లకు లేని సమస్య వీళ్లకే ఎందుకన్న అనుమానం కలిగింది.
శ్రీలంక ఆటగాళ్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు వేశారు. అయితే ఇప్పుడు టీమిండియా పేసర్ షమీ కూడా వాంతి చేసుకోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు సోమవారం షమీ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో గాలి కాలుష్యం ఆందోళనకరంగానే ఉందని చెప్పిన సంగతి తెలిసందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.